సొమ్ము రికవరీ మాటేమిటి?
ముగ్గురు అధికారుల ఇంక్రిమెంట్లలో కోత
ఒక అధికారి ఏకంగా విధుల నుంచి డిస్మిస్
దేవాదాయ శాఖ సంచలన ఉత్తర్వులు జారీ
రూ.52లక్షలు రికవరీ చేయాలని భక్తుల డిమాండ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్:
సుమారు రెండేళ్ల క్రితం.. కొండగట్టు ఆలయ నిధుల గోల్మాల్ వ్యవహారంలో దేవాదాయ శాఖ కొరఢా ఝుళిపించింది. సొమ్ము గల్లంతుకు బాధ్యులుగా చేస్తూ నలుగురు అధికారులను పేర్కొన్న దేవాదాయ శాఖ.. వారిలో ముగ్గురికి రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. మరో అధికారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు వెలువరించింది. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో 2024లో దాదాపు రూ.52,90,000 సొమ్ము గల్లంతైంది. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అంతర్గత ఆడిటింగ్లో గుర్తించి విచారణకు ఆదేశించింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్ను విచారణాధికారిగా నియమించింది. ఆయన తన విచారణలో నిధుల గోల్మాల్ నిజమేనని నిర్ధారించారు. ఈ వ్యవహారానికి బాధ్యులుగా ప్రస్తుతం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పనిచేస్తున్న బి.శ్రీనివాస్, ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న అప్పటి సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసాచారి, వేములవాడ రాజన్న ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసశర్మ, కొండగట్టు ఆలయ సూపరింటెండెంట్ డి.సునీల్కుమార్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి ఈ నలుగురు అధికారులు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని భావించిన ఉన్నతాధికారులు నలుగురిపైనా చర్యలకు ఉపక్రమించారు. నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు.. రికార్డులను సరిగా తనిఖీ చేయనందుకు వీరిపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కొమురవెల్లి మల్లన్న ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీనివాసశర్మ (వేములవాడ), సునీల్కుమార్ (కొండగట్టు)కు రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించింది. ఆ సమయంలో సీనియర్ అసిస్టెంట్గా ఉండి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న శ్రీనివాసాచారిని సర్వీసు నుంచి డిస్మిస్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఇదే వ్యవహారంలో కొండగట్టు ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్)గా ఉన్న టంకశాల వెంకటేశ్ సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే.
దేవాలయానికి వివిధ మార్గాల్లో వచ్చిన ఆదాయం అధికారుల నిర్లక్ష్యంతో గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన దేవాదాయ శాఖ విచారణ చేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంది. ఇంతవరకూ బానే ఉన్నా.. గల్లంతైన అంజన్న సొమ్ము రికవరీ బాధ్యత ఎవరిది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అసలే అంతంతమాత్రంగా ఆదాయం వస్తున్న అంజన్న ఆలయానికి రూ.52.9 లక్షల రికవరీకి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 2023లో ఆలయంలో చోరీ చేసిన దొంగల నుంచి అంజన్న ఆభరణాలను పోలీసులు రికవరీ చేసిన విధంగానే ఇపుడు కూడా గల్లంతైన సొమ్మును దేవాదాయ శాఖ వసూలు చేయాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు.


