● మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ కార్పొరేషన్: బల్దియా సమావేశాలు జరిగాయా లేదా అనేది కూడా తెలుసుకునే సోయి మాజీ మేయర్ రవీందర్సింగ్కు లేదా అని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే పనులు మానుకోవాలని హితవు పలికారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగరపాలక సంస్థలో 3 నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించలేదని, మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ రవీందర్సింగ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తమ పాలకవర్గం ఏర్పడిన 5 నెలల్లో మూడుసార్లు సర్వసభ్య సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నగర అభివృద్ధికి కీలకమైన బడ్జెట్ సమావేశం కూడా అందులో ఉందని గుర్తు చేశారు. జరిగిన సమావేశాలు అధికారికంగా రికార్డుల్లో ఉన్నాయని, మాజీ మేయర్ రవీందర్సింగ్ వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమన్నారు. అబద్ధపు రాజకీయాలు మాని అభివృద్ధికి సహకరించాలని సూచించారు.


