
బీబీపేట గ్రామం
అప్పట్లో తమలపాకుల తోటలకు ప్రసిద్ధి
నేడు సాగునీరు కరువై పంట వదిలేసిన రైతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బీబీపేట.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకువచ్చేది తమలపాకుల తోటలు. నిజాం కాలంలోనే ఇక్కడి పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు ఉండేవి. తాతల కాలం నుంచి తమలపాకులు పండించిన కామారెడ్డి జిల్లా బీబీపేట రైతులు సాగునీటి కష్టాలతో పంట సాగును వదిలేశారు. అయితే తమలపాకులతో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేని రైతులు.. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని ఆకులు అమ్ముతూ పూటగడుపుతున్నారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు సరిహద్దుల్లో ఉన్న బీబీపేట గ్రామంలో 2,532 కుటుంబాలు ఉండగా, 11,312 మంది జనాభా ఉంది. ఇక్కడ అత్యధిక కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నాయి.
గ్రామ రైతులు నిజాం కాలం నుంచే తమలపాకులను పండించేవారు. దాదాపు ఏడు గ్రామాలకు సాగునీటినందించే బీబీపేట పెద్ద చెరువు కింద తమలపాకుల తోటలు సాగు చేసేవారు. ఇక్కడ పండించిన తమలపాకుల్లో ఘాటు ఎక్కువగా ఉండేదని చెబుతారు. నిజాం నవాబు కుటుంబానికి కూడా ఇక్కడి నుంచి తమలపాకులు వెళ్లేవి. వీటిని నిజాం నవాబు కూడా ఎంతో ఇష్టపడేవారని చెబుతారు. పెద్ద చెరువు కింద దాదాపు 140 ఎకరాల్లో తమలపాకుల తోటలు పెంచేవారు. ఇక్కడ పండించిన తమలపాకులను అప్పట్లో హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు.
ఉమ్మడిగా తోటల పెంపకం
తమలపాకుల తోటలను రైతులు ఉమ్మడిగా పెంచేవారు. ఒక ఎకరం భూమిలో పది నుంచి పదిహేను మంది రైతులు కలిసి పంట సాగు చేసేవారు. తోట పెంచడమే కాదు ఆకులను తెంపడం, వాటిని రవాణా చేయడం, అమ్మడం వంటి పనులు చేయడానికి ఎక్కువ మంది అవసరం ఉంటుండడంతో రైతులు ఉమ్మడిగా పంట పండించేవారు. తద్వారా ఏ ఇబ్బంది లేకుండా ఉండేది. కొందరు రైతులైతే కూలీల అవసరం లేకుండానే వారి కుటుంబ సభ్యులే కలిసి పంట సాగు నుంచి తెంపడం, అమ్మడం దాకా వాళ్లే చేసుకునేవారు.
వందలాది మంది రైతులు పంటల సాగులో పనిచేసేవారు. తమలపాకు తోటల ద్వారా గ్రామంలో కూలీలకు కూడా ఎంతో ఉపాధి లభించేది. తమలపాకు తోటలతో ఆ కుటుంబాలన్నీ ఉన్నతంగా బతికేవి. అయితే 1995 ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో చెరువు నిండకపోవడంతో రైతులు తమలపాకుల తోటల సాగుకు దూరమయ్యారు. దశాబ్దాల పాటు తమలపాకుల తోటలతో బతికిన రైతులు, నీళ్లు లేక పంట భూములను పడావుగా వదిలేయాల్సి వచ్చింది.
దిగుమతి చేసుకుని అమ్ముకుంటున్న రైతులు
తమలపాకుల తోటలతోనే జీవనం సాగించిన ఎన్నో కుటుంబాలు తోటలు పెంచడం మానేసినప్పటికీ వ్యాపారాన్ని మానలేకపోయాయి. దీంతో ఆయా కుటుంబాలవారు ఇతర ప్రాంతాల నుంచి తమలపాకులను తెప్పించుకుని విక్రయిస్తున్నారు. కామారెడ్డి, దోమకొండ, సిరిసిల్ల, మాచారెడ్డి, గంభీరావుపేట, రామాయంపేట తదితర ప్రాంతాలకు బీబీపేట (Bibipet) రైతులు వెళ్లి తమలపాకులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు.
చదవండి: మూడు సంస్థానాలు, 46 జాగీర్లు
ఒకప్పుడు తమలపాకులు పండించి, ఎగుమతి చేసిన రైతులు ఇప్పుడు దిగుమతి చేసుకుని అమ్ముకునే దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ తమలపాకులు పండినపుడు హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లి అమ్మేవారు. నాందేడ్ ప్రాంతం నుంచి వ్యాపారులు వచ్చి తమలపాకులను కొనుగోలు చేసుకుని తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులై రైతులు తమలపాకులను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
తమలపాకులతోనే జీవనం
నా వయసు 83 ఏండ్లు. మా తాతల కాలం నుంచి తమలపాకుల తోటలు ఉండేవి. నేను 30 ఏళ్లపాటు పెంచిన. ఆకుతోటమీదనే బతికినం. ఆకులను తలమడ్ల రైల్వే స్టేషన్ దాకా ఎడ్ల బండ్లమీద తీసుకుపోయి అక్కడి నుంచి రైలులో పట్నం తీసుకుపోయి అమ్ముతుంటిమి. కొందరు పంట మీద వడ్లు పెట్టేటోళ్లు. మా ఊరికి ఎక్కడెక్కడి నుంచో బ్యారగాళ్లు అచ్చి ఆకులు కొనుక్కుని పోయేటోళ్లు. బీబీపేట అంటేనే తమలపాకుల తోటలు గుర్తు చేసేటోళ్లు. మా ఊరికి ఎంతో పేరుండేది. నీళ్ల కరువుతోని తోటలు బందుజేసినం. ఇగ తోటల ముచ్చటనే లేకుండాపోయింది. ఇప్పుడు మా మనుమడు హైదరాబాద్ (Hyderabad) నుంచి తమలపాలకులు తీసుకువచ్చి ఇస్తే బస్టాండ్ దగ్గర కూర్చుని అమ్ముతున్న.
– కుర్ల నారాయణ, బీబీపేట