సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన రైతు సలావత్ మత్తు(45)పై ఎలుగుబంటి దాడి చేసింది. అడవికి కట్టెల కోసం వెళ్లిన సమయంలో ఘటన జరిగింది. భార్య, స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఎలుగుబంటి పారిపోయింది. మత్తు ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. మొదట పులి దాడి చేసిందని ప్రచారం జరగ్గా.. ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానిక సర్పంచ్ వెల్లడించారు.
రైతును కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అటవీ ప్రాంతానికి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
మరో వైపు, జిల్లాలో పులుల దాడులు కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం 2 లేగ దూడలు, రెండు మేకలు మృత్యువాత పడ్డాయి. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందింది. ఇసన్నపల్లి శివారులో మేకల మందపై చిరుతపులి దాడి చేసి రెండు మేకలను ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.


