మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు | Nizamabad forts and jagirs history full details | Sakshi
Sakshi News home page

Nizamabad: మూడు సంస్థానాలు.. 46 జాగీర్లు

Jun 14 2025 7:44 PM | Updated on Jun 14 2025 7:50 PM

Nizamabad forts and jagirs history full details

దోమకొండ కోట‌

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒకప్పటి పాలన తీరు

ఇప్పటికీ ఆకట్టుకుంటున్న దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్‌ కోటలు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా చరిత్ర పుటల్లో అనేక పేజీలు లిఖించుకుంది. కాకతీయుల పాలన తరువాత కూడా ఇందూరు సీమలో పలువురు సంస్థానాదీశులు, జాగీర్‌దార్లు తమదైన ముద్ర వేశారు. ఇందులో కీలకమైన దోమకొండ సంస్థానం, సిర్నాపల్లి సంస్థానానికి చెందిన కోటలు ఆకట్టుకుంటున్నాయి. కౌలాస్‌ కోటను మాత్రం సందర్శకులు వచ్చేలా అభివృద్ధి చేయకపోవడం గమనార్హం.

దోమకొండ సంస్థానం.. 
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండ సంస్థానం (Domakonda Samsthanam) మూలస్థానం భిక్కనూరు. ఈ సంస్థానం కేంద్రం కొంతకాలం రామారెడ్డి, కామారెడ్డిల్లో ఉండేది. చివరకు దోమకొండ కేంద్రంగా స్థిరపడింది. ఈ సంస్థానాధీశులు మొదట కుతుబ్‌షాహీలు, తరువాత అసఫ్‌జాహీలకు సామంతులుగా ఉన్నారు. కామినేని వంశస్తుడైన కామినేడు దీనికి మూలపురుషుడు. కామిరెడ్డి, కామినేని చౌదరిగా పేరుపొందాడు. 

కామిరెడ్డి కుమారుడు కాచారెడ్డి, కాచారెడ్డి కుమారుడు రాజన్న చౌదరి, రాజన్నచౌదరి కుమారుడు రాజేశ్వరరావు, ఈయన కుమారుడు పెద్ద రాజేశ్వరరావు, తరువాత రాజేశ్వరరావు సోదరుడు అన్నారెడ్డి, అన్నారెడ్డి తరువాత ఇతని కుమారుడు ఉమాపతిరావు, తరువాత ఇతని కుమారులు రామచంద్రరావు, సోమేశ్వరరావు, తరువాత సోమేశ్వరరావు కుమారుడు రెండో ఉమాపతిరావు, తరువాత ఇతని కుమారుడు రాజేశ్వరరావు, అనంతరం ఈయన కుమారుడు రాజా సోమేశ్వరరావు పాలించారు. 300 ఏళ్ల పాటు అవిచ్ఛిన్నంగా దోమకొండ సంస్థనాదీశులు పాలన చేశారు.

కౌలాస్‌ సంస్థానం.. 
కాకతీయుల తరువాత కొద్దికాలం పాటు ఈ ప్రాంతం విజయనగర రాజుల పాలనలో ఉండేది. కుతుబ్‌షాహీల తరువాత, అసఫ్‌జాహీల పాలనలో ఉండేది. అయితే రాజస్తాన్‌ రాజపుత్ర వంశానికి చెందిన గోపాల్‌సింగ్‌ గౌర్‌ దక్కనుకు వచ్చి నిజాం సైన్యంలో అధిపతిగా చేరాడు. మహారాష్ట్ర సైన్యంతో వీరోచిత పోరాటం చేయడంతో ఇతనికి నిజాం కౌలాస్‌ కోటను అప్పగించాడు. ఇతని తరువాత రాజా పదంసింగ్‌ గౌర్, రాజాకున్వర్‌ నరేందర్‌సింగ్‌ గౌర్, రాజాకున్వర్‌ నైన్‌సింగ్‌ గౌర్, రాజాకున్వర్‌ దీప్‌సింగ్‌ గౌర్‌ పాలించారు. 

రాజాకున్వర్‌ దీప్‌సింగ్‌ గౌర్‌ ద్వారా అనేక పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తరువాత దుర్జన్‌సింగ్, జగత్‌సింగ్, శివసదన్‌ సింగ్‌ పాలించారు. శివసదన్‌సింగ్‌ ఆరుగురు కుమారుల్లో ఒకరైన అజిత్‌కుమార్‌ సింగ్‌ భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసి, తరువాత మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఎన్‌సీసీ అధికారిగా అనేకమంది అధికారులను తీర్చిదిద్దారు.

భూమి ధారాదత్తం 
రాజుల సేవలో పాలు పంచుకున్నందుకు, యుద్ధాలలో పాల్గొన్నందుకు, ఆపద సమయాల్లో ఆదుకున్నందుకు, ఇతర కారణాలతో, రాజులు కొందరికి అధిక మొత్తంలో భూమిని ధారాదత్తం చేశారు. అలా ఎక్కువ మొత్తంలో భూమి పొందిన వారు సంస్థానాదీశులు, జాగీర్‌దార్లు, జమీన్‌దారులు, మాషుదార్లు, ముననబ్‌దార్లుగా పిలవబడ్డారు. సంస్థానాలు అంటే చాలా మొత్తంలో ఎక్కువ గ్రామాలు ఏలుబడి కలిగిన అధికారం అని, సంస్థానాదీశులు అంటే ఆ ప్రాంతానికి అధికారులని అర్థం. నిజామాబాద్‌ జిల్లాలో దోమకొండ, సిర్నాపల్లి, కౌలాస్‌ సంస్థానాలతో పాటు 46 జాగీరులు ఉండేవి.

చ‌ద‌వండి: కాశీ త‌ర్వాత కందూరే!

సిర్నాపల్లి సంస్థానం.. 
ఇందూరు జిల్లాలో సిర్నాపల్లి సంస్థానం (Sirnapalli Samsthanam) ప్రత్యేకమైనది. దీని సంస్థానాదీశుడు చెన్నారెడ్డి. తరువాత ఆయన కుమారుడు రఘుపతిరెడ్డి, చెన్నారెడ్డి, రాంరెడ్డి, రఘునాథరెడ్డి, చెన్నారెడ్డి, వెంకటరెడ్డి, చెన్నారెడ్డి వరుసగా వంశపారంపర్యంగా పాలించారు. చెన్నారెడ్డి మరణంతో ఆయన భార్య రాణి ఉషమ్మ 1203లో అధికారం చేపట్టింది. ఆమె తరువాత రాజారామ్‌ పాలించారు. తరువాత రాజారామ్‌ మరణంతో ఆయన భార్య జానకీబాయి సంస్థానాదీశురాలయ్యారు. తరువాత ఈమె కుమారుడు రఘుపతిరెడ్డి, తరువాత ఆయన కుమారుడు ప్రతాపరెడ్డి పాలించారు. 1294లో ప్రతాపరెడ్డి మరణంతో ఆయన భార్య శీలం జానకీబాయి బాధ్యతలు చేపట్టింది. శీలం జానకీబాయి ఆధ్వర్యంలో అనేక చెరువులు తవ్వించారు. చిన్న చిన్న ఆనకట్టలు నిర్మించారు. ఇప్పటికీ ఈమె తవ్వించిన చెరువులు నీటితో నిండి సాగుకు ఉపయోగపడుతున్నాయి. 



నిజామాబాద్‌ నగరంలో గంజ్‌ స్తంభాన్ని నిర్మించారు. జానకీబాయి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. జానకీబాయికి సంతానం లేకపోవడంతో తన సోదరుడి కుమారుడు రఘుపతిరెడ్డిని దత్తత తీసుకుని రాణి మంగమ్మతో వివాహం జరిపించగా.. రెండేళ్లకే రఘుపతిరెడ్డి మరణించాడు. దీంతో రాణి మంగమ్మ శీలం రామలింగారెడ్డిని దత్తత తీసుకున్నారు. జానకీబాయి మరణానంతరం రామలింగారెడ్డి అధికారం చేపట్టి, వనపర్తి సంస్థానాదీశుడైన రెండో రాజారామేశ్వరరావు కుమార్తె జానకమ్మను వివాహం చేసుకున్నాడు. తరువాత రామలింగారెడ్డి కుమారుడు రాంభూపాల్‌ సంస్థానాదీశుడయ్యాడు. నిజాం రాజ్యం పతనమయ్యాక రాంభూపాల్‌ ఐఏఎస్‌ ఉత్తీర్ణుడై కలెక్టరుగా పనిచేశాడు. రాంభూపాల్‌ ఇద్దరు కుమారులు ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడ్డారు. కుమార్తె అనురాధరెడ్డి మాత్రం చరిత్ర పరిశోధన, సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement