పిల్లలకు బిర్యానీ తినిపిస్తూ సెల్ఫీ దిగిన తండ్రి కృష్ణ
నిజాంసాగర్ ప్రాజెక్టులో పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో గొడవల కారణంగా ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనచోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట గ్రామానికి చెందిన బోయి కృష్ణ (34), సవిత దంపతులకు ఇద్దరు పిల్లలు అనన్య (5), రక్షిత్ (9) ఉన్నారు. వీరిది రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. సరైన ఉపాధి లేక కృష్ణ, సవిత దంపతులు ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల కిందట రామచంద్రపురం వలస వెళ్లారు. కృష్ణ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా సవిత హోటల్లో లేబర్ పని చేస్తోంది.
కృష్ణ మద్యం సేవిస్తూ సరిగ్గా పనిచేయకపోవడంతో భార్య మందలించేది. ఇదేవిషయమై ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులకు చేతిలో డబ్బులు లేకపోవడంతో కృష్ణ జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలో పిక్నిక్ వెళ్దామని చెప్పి గురువారం పిల్లలను బైక్పై పటాన్ చెరు నుంచి నిజాంసాగర్ప్రాజెక్టు వద్దకు తీసుకు వచ్చాడు. ప్రాజెక్టువద్ద పర్యాటక ప్రదేశాలను పిల్లలకు చూపించి, హోటల్ నుంచి తీసుకు వచ్చిన బిర్యానీ తినిపించాడు. ప్రాజెక్టు పరిసరాల్లో విహరించిన ఫొటోలు తన అల్లుడు నవీన్కు వాట్సాప్లో పంపించాడు. అలాగే ప్రాజెక్టు నీటిలోకి తెప్పపైన పిల్లలతో కలిసి వెళ్తున్న వీడియో తీసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సందేశం పంపాడు.
మత్య్సకార్మికులు చేపల వేటకు ఉపయోగించే తెప్పపైన ప్రాజెక్టు మధ్య భాగంలోకి వెళ్లిన తర్వాత పిల్లలను నీటిలోకి తోసేశాడు. ఆ తర్వాత కృష్ణకూడా తెప్పపై నుంచి నీటిలోకి దూకి తనువు చాలించాడు. సాయంత్రం వరకు పిల్లలతో పాటు భర్త ఇంటికి రాకపోవడంతో సవిత బంధువులకు ఫోన్ చేయగా ఆత్మహత్య విషయం తెలిసింది. కుటుంబీకులు, బంధువులు నిజాంసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై శివకుమార్ హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి చూడగా బైక్తో పాటు పిల్లల చెప్పులున్నాయి. జాలర్లు, రెస్క్యూ టీం బృందాలు ప్రాజెక్టు నీటిలో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.బాన్సువాడ రూరల్ సీఐ తిరుపతయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


