హెచ్‌ఎండీఏ భూముల వేలం.. కనీస ధర గజానికి రూ.50 వేలు | HMDA Lands Auction Latest Update | Sakshi
Sakshi News home page

విక్రయానికి సిద్ధంగా హెచ్‌ఎండీఏ భూములు

Jun 22 2026 7:55 PM | Updated on Jun 22 2026 8:08 PM

HMDA Lands Auction Latest Update

ఈ నెల 24, 29, 30వ తేదీల్లో ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) మరోసారి భూముల వేలానికి సన్నద్ధమైంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న విలువైన స్థలాలను ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా విక్రయించనున్నారు. బంజారాహిల్స్‌లోని 102/1, టీఎస్‌ నంబర్‌ 1/పిఅండ్‌ 3/పిలోని 8.24 ఎకరాల భూములను జూలై 2న వేలం వేయనున్నారు. ఈ భూములపై ఈ నెల 24వ తేదీన ప్రీబిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు  తెలిపారు.

ఈ భూములకు ఈ నెల 12న ప్రీబిడ్‌సమావేశాన్ని ఏర్పాటు చేసి 19న బిడ్డింగ్‌ నిర్వహించాలని మొదట నిర్ణయించారు. కానీ యమునా నగర్‌ కో–ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ, థీమ్‌ అంబియన్స్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలు సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దులను గుర్తించిన తర్వాతే వేలం వేయాలని కోరడంతో బిడ్డింగ్‌ తేదీలను హెచ్‌ఎండీఏ సవరించింది. ఈ భూములకు ఎకరానికి రూ.99 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు.  

మోకిలలో 100 ప్లాట్‌లు.. 
అలాగే మోకిలలోని మరో 100 ప్లాట్‌లకు ఈ నెల 29, 30 తేదీల్లో బిడ్డింగ్‌ నిర్వహించనున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాట్‌ కనిష్టంగా 300 చదరపు గజాల నుంచి గరిష్టంగా 500 చ.గ.ల వరకు ఉన్నాయి. కనీస ధర గజానికి  రూ.50 వేలుగా ప్రతిపాదించారు. మేడిపల్లిలో ఉన్న 68 ప్లాట్‌లకు ఈ నెల 24వ ఈ–బిడ్డింగ్‌ నిర్వహిస్తారు. కనిష్టంగా 231.66 చ.గ. నుంచి గరిష్టంగా 643.22 చ.గ. విస్తీర్ణంతో ప్లాట్‌లు ఉన్నాయి. గజానికి రూ.45 వేల చొప్పున  నిర్ణయించారు. మోకిల ప్లాట్‌లకు ఈ నెల 22న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు.

చ‌ద‌వండి: కొత్త రేష‌న్ కార్డులు హుళ‌క్కే!

విక్రయించనున్న హెచ్‌ఎండీఏ భూములపై ఎలాంటి వివాదాలు లేవని హెచ్‌ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. మేడిపల్లిలోని భూములను నిషేధిత జాబితా నుంచి డీ–నోటిఫై చేసిన అనంతరమే హెచ్‌ఎండీఏ స్వా«దీనంలోకి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మూడుచోట్ల భూముల అమ్మకాల ద్వారా రూ.1000 కోట్లకు పైగా ఆదాయం లభించవచ్చని అధికారుల అంచనా. వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న బిడ్డర్‌లు మేడిపల్లి ప్లాట్‌ల కోసం ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మోకిలా  ప్లాట్‌లకు 27 వరకు, బంజారాహిల్స్‌ భూములకు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement