సాక్షి,హైదరాబాద్: తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో అత్తాపూర్ పోలీసులు ఆయనను ఉప్పరపల్లి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టు హాలులోనే ఉదయ్ కృష్ణారెడ్డి బోరున విలపించారు.
సైబరాబాద్ సీపీ సజ్జనార్పై ఆయన మేజిస్ట్రేట్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో తనను సీపీ సజ్జనార్ తీవ్రంగా బెదిరించారని, ‘నిన్ను ఎన్కౌంటర్ చేస్తాం’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఉదయ్ ఆరోపించారు.
న్యాయస్థానానికి సమర్పించిన ఫిర్యాదులో ఉదయ్ కృష్ణారెడ్డి పలు కీలక అంశాలను పేర్కొన్నారు. నన్ను సీసీ కెమెరాలు లేని చోటుకు తీసుకెళ్లి విచారించారు. టాస్క్ఫోర్స్ ఆఫీసులో ఉంచి తీవ్రంగా హింసించారు అని వాపోయారు. నిందితుడి ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన మేజిస్ట్రేట్.. సీసీ కెమెరాలు లేని చోట విచారణ ఎలా జరుపుతారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రెండు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలంటూ అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు కోర్టు షోకాజు నోటీసులు జారీ చేసింది


