Heavy Rains In Nizamabad And Warangal District - Sakshi
Sakshi News home page

వణికిన నిజామాబాద్‌.. ఓరుగల్లులో జడివాన 

Jul 26 2023 3:45 AM | Updated on Jul 26 2023 9:22 PM

Heavy rains in Nizamabad and Warangal districts - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: సోమవారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వానలు పడినా.. ఉమ్మడి నిజామాబాద్, వరంగల్‌ జిల్లాలు మాత్రం కుండపోత వర్షంతో వణికిపోయాయి. పలుచోట్ల అయితే కొంత దూరంలో ఉన్నవేవీ కనబడనంతగా అతి భారీ వర్షం పడింది.

నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లో సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు ఆరు గంటల్లోనే ఏకంగా 46.4 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వాన పడింది. చాలా ప్రాంతాల్లో 15 సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జిల్లాలో 73 ఇళ్లు దెబ్బతిన్నాయి. వేల్పూర్‌లో చెరువు కట్ట తెగిపోయి నీరంతా రోడ్డుపై ప్రవహిస్తూనే ఉంది.

ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ నీటమునిగాయి. ఇదే మండలంలోని పచ్చలనడ్కుడ వద్ద చెరువు కట్ట తెగిపోవడంతో భీంగల్‌ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. లక్కోర, ఆర్మూర్‌ మండలం చేపూర్‌ వద్ద 63వ నంబర్‌ జాతీయ రహదారి కోతకు గురైంది. జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌–తొర్లికొండ మధ్య రోడ్డు తెగిపోయింది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లానూ వాన ముంచెత్తింది. వరంగల్‌ నగరంలో 31 కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరి నిత్యాసవరాలు, సామగ్రి తడిసిపోయాయి. 700 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ధర్మసాగర్, ఆత్మకూర్, గీసుకొండ, రేగొండ, మల్హర్‌రావు మండలాల్లో అతిభారీ వర్షపాతం నమోదైంది.  

మెదక్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని హుస్నాబాద్‌లో చెరువులు మత్తడి దూకుతున్నాయి. పట్టణంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. పోలీస్‌స్టేషన్‌ చుట్టూ జలమయం అయింది. కూడెల్లి, మోయతుమ్మెద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బస్వాపూర్‌ వద్ద సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై వరద పోటెత్తడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. 

 ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిశాయి. మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు రిజర్వాయర్లకు గణనీయంగా ప్రవాహాలు వస్తున్నాయి. 

ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగాయి. రహదారులపై వరద ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. పాలేరు, కిన్నెరసాని రిజర్వాయర్లు గరిష్ట స్థాయికి చేరాయి. 

రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వానలతో కాగ్నా, మూసీ, ఈసీ, బెల్కటూర్, రాస్నం వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కోట్‌పల్లి, లఖ్నాపూర్, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. పలుచోట్ల పొలాలు నీట మునిగాయి.  

 ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఓ మోస్తరు వానలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, భవానీ నగర్‌ ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పత్తి చేన్లు నీట మునిగాయి. బొమ్మలరామారం మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. 

వాగులో కొట్టుకుపోయి ఇద్దరు యువతులు మృతి 
మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం కొండేడ్‌కు చెందిన పడకంటి కేశవులుకు దుందుభి వాగు అవతల వ్యవసాయ భూమి ఉంది. ఇటీవలే అందులో పత్తి సాగు చేపట్టారు. మంగళవారం కేశవులు కుమార్తె స్వాతి (18), వరుసకు సోదరి అయ్యే అనూష (19) కలసి పత్తి చేనులో మందు చల్లేందుకు వెళ్లారు.

కానీ దుందుభి వాగు దాటే క్రమంలో వరదలో కొట్టుకుపోయారు. కొంతసేపటికి స్వాతి తల్లి నాగమ్మ, మరికొందరు కూలీలు చేనుకు వెళ్లేందుకు వాగు దగ్గరికిరాగా.. నీళ్ల బిందె, టిఫిన్‌ బాక్సు కనిపించాయి. గ్రామస్తులు గాలింపు చేపట్టగా రెండు గంటల తర్వాత కిలోమీటర్‌ దూరంలోని చిన్న ఆదిరాల శివారులో స్వాతి, అనూషల మృతదేహాలు కనిపించాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

బడి చుట్టూ చెరువులా.. 
భారీ వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణ చెరువులా మారిన దృశ్యమిది. మోకాలి లోతు నీరు నిలవడంతో తరగతి గదులకు చేరుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక పెద్దపల్లి తహసీల్దార్‌ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ మైదానంలో నీరు నిలిచింది. 

కొట్టుకుపోయిన డైవర్షన్‌ రోడ్లు
సాక్షి, హైదరాబాద్‌: వరుసవర్షాల ధాటికి డైవర్షన్‌ రోడ్లు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో వంతెనల వద్ద ఏర్పాటు చేసిన మళ్లింపు రోడ్లు కొట్టుకుపోయాయి. ఆయా ప్రాంతాల్లో వాగులు పొంగి, మళ్లింపు రోడ్ల ఆనవాళ్లే లేకుండా పోవడంతో రాకపోకలు కష్టతరమవుతున్నాయి. 

 ఆదిలాబాద్‌ జిల్లాలో ఇచ్చోడ, బో«ధ్, నేరేడు­గొండ, బదహత్నూరు ప్రాంతాల్లో మళ్లింపు రోడ్లు కొట్టుకుపోయాయి. జైనథ్‌బే­లా ప్రధాన రోడ్డు కూడా దెబ్బతింది.  ఒక్క ఆదిలాబాద్‌­లోనే 9 కి.మీ. మేర ప్రధాన రోడ్లకు నష్టం వాటిల్లింది. 

 కామారెడ్డి జిల్లాలో ఐదు ప్రాంతాల్లో  రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మిగతా ప్రాంతాల్లో జి­లా­్లకు ఒకటి రెండు చోట్ల వాటికి నష్టం వా­టిల్లింది.

 రాజీవ్‌ రహదారిలో శామీర్‌పేట నుంచి ప్రజ్ఞా­పూ­ర్‌ మధ్య దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతలమయంగా మారింది. 

డైవర్షన్‌ రోడ్లు దెబ్బతిన్న కారణంగా  20 చోట్ల ఎగువ ప్రాంతాలతో అనుసంధానం లేకుండాపోయింది.దాదాపు రూ.100 కోట్లతోపునరుద్ధరణ చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మళ్లింపుదారులు పూర్తిగా కొట్టుకుపోయిన చోట వెంటనే తాత్కాలిక రోడ్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించారు. రాజీవ్‌ రహదారిపై ప్యాచ్‌ వర్క్‌ మొదలుపెట్టారు. 

వానాకాలం వస్తే వణుకే.. 
గూడూరు: వానాకాలం వచ్చిందంటే ఆ గ్రామ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. సరైన రోడ్డు, వాగులపై వంతెనలు లేక.. ఏటా రెండు, మూడు నెలలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిందే. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడ జీపీ పరిధిలో దొరవారి తిమ్మాపురం గ్రామం దుస్థితి ఇది.

అడవిలో ఉన్న ఈ గ్రామం మట్టెవాడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. అందులో ఎనిమిది కిలోమీటర్ల మేర మట్టి దారే. పైగా మధ్యలో వాగులు, వంకలు. సోమవారం రాత్రి కురిసిన వాన­కు గుండ్లమడుగు వాగు పోటెత్తడంతో ఈ గ్రామా­నికి రాకపోకలు నిలిచిపోయాయి.

కావాల్సిన సరుకులు ముందే తెచ్చిపెట్టుకుంటున్నామని, కానీ ఏదైనా ఆపద వస్తే ప్రాణాలు కాపాడుకోవడం కష్టమే­న­ని గ్రామస్తులు వాపోతున్నారు. తమ గ్రామానికి రోడ్డును, వంతెనను నిర్మించాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement