Hyderabad: దుమ్ములో బంగారం కోసం వెదుకులాట | Gold Mines At Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: దుమ్ములో బంగారం కోసం వెదుకులాట

Dec 29 2024 7:36 AM | Updated on Dec 29 2024 7:36 AM

Gold Mines At Hyderabad

పాతబస్తీ కేంద్రంగా ఏళ్ల తరబడి ప్రక్రియ  

చార్మినార్: మట్టిలో మాణిక్యాలేమో కానీ.. పాతబస్తీలో ఏళ్ల తరబడి ఓ కుటుంబం మట్టిలో బంగారం, వెండిని వెదుకుతున్నారు. బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాల్లో మట్టిని ఏకం చేసి అందులో ఏమైనా చిన్న చిన్న తుకడలు (ముక్కలు) దొరుకుతాయేమోననే ఆశతో వడపోస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి కంటికి కనిపించని సూక్ష్మంగా పౌడర్‌ తరహాలో కూడా దొరుకుతుందని చెబుతున్నారు. మట్టిలో నుంచి వడపోత ద్వారా మట్టి లాంటి పసుపు, తెలుపు రంగు పౌడర్‌ రూపంలో బంగారం, వెండి లభిస్తుందంటున్నారు. 

పాతబస్తీ కేంద్రంగా... 
నిజాం కాలం నుంచి పాతబస్తీలోని చార్మినార్ పరిసరాలు బంగారు, వెండి ఆభరణాల క్రయ విక్రయాలకు పెట్టింది పేరు. ఆభరణాల దుకాణాలతో పాటు ఆర్డర్లపై ఆభరణాలను తయారు చేసే ఖార్ఖానాలు కూడా ఇక్కడి గల్లీల్లో అధికంగా ఉన్నాయి. దాదాపు 250–300 వరకూ దుకాణాలున్నాయి. కొనుగోలుదారుల ఆర్డర్‌ మేరకు దుకాణ దారులు అర్చుల రూపంలో వసువు తయారీకి బంగారం అందజేస్తారు. 

తరుగు, మజూరీ నుంచే... 
ఆభరణాల తయారీ సమయంలో ముద్ద లాంటి బంగారపు కడ్డీనీ కరిగించి, మరిగించి ఆభరణాలను తయారు చేస్తారు. ఇలా చేసే క్రమంలో సూక్ష్మాతి సూక్ష్మమైన రేణువుల రూపంలో బంగారం కింద పడి దుమ్ము, మట్టిలో కలుస్తుంది. దీన్నే బంగారపు షాపుల వారు తరుగు కింద లెక్కగడతారు. (తరుగు అంటే వేస్టేజ్, మజూరీ అంటే చేత కూలి) ఈ రోజువారీ తయారీ ప్రక్రియలో వందల సంఖ్యలో బంగారపు వస్తువులు తయారవుతుంటాయి. ఈ క్రమంలో తయారీ దారులు ఎక్కువ శాతం ఆ రజన్‌లోని ప్రధాన భాగాన్ని వారే వడపోసుకుంటారు. వారు కూడా సేకరించలేని రేణువులనే వడపోతకు అప్పగిస్తారు.  

ఇది నిరంతర ప్రక్రియ.. 
ఈ ప్రకియ్ర కోసం ముందుగా డబ్బులు చెల్లించి మట్టి, చెత్త సేకరిస్తారు. గుల్జార్‌హౌజ్‌–కాలికమాన్‌ వద్ద ఈ బంగారం, వెండి వడపోత కార్యక్రమం ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగుతుంది. లాల్‌దర్వాజకు చెందిన విజయ్‌ కుటుంబం దశాబ్దాలుగా తాత ముత్తాతల నుంచి ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పురానాపూల్‌కు చెందిన ప్రెమ్‌కుమార్‌ చార్మినార్, కాలికమాన్, గుల్జార్‌హౌజ్, మామాజుమ్లా పాఠక్, కోకర్‌వాడి, రికాబ్‌గంజ్, ఆనంద్‌గల్లి, ఘాన్జీబజార్‌ తదితర ప్రాంతాల్లోని ఖార్ఖానాల నుంచి ఈ చెత్తను వడపోస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కోసారి బంగారం దొరికినా, దొరక్కపోయినా నెలవారీ డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే..

అణువణువూ గాలించాలి.. 
వడపోత సమయంలో అణువణువూ జాగ్రత్తగా శోధించాలి. చివరికి అయస్కాంతంతోనూ వేరు చేస్తాం. ఈ పౌడర్‌ను మళ్లి వేడి చేసి చిన్న ముద్దలాగా తయారు చేస్తాం. ఒక్కో రోజు పావు గ్రాము నుంచి అర గ్రాము వరకూ దొరుకుతుంది. ప్రస్తుతం మార్కెట్‌ ధర ప్రకారం గ్రాము రూ.7500..అదృష్టం బాగుంటే ఒక గ్రాము జమవుతుంది. ఎప్పుడైనా అనుకోకుండా తులం (10 గ్రాములు) లభిస్తే..దుకాణాల యజమానులు వచ్చి ఇది మాదే అని లాక్కుపోతారు.  
– ప్రేమ్‌ కుమార్, పురానాపూల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement