సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల ఆయకట్టులో పంటల సాగు పరిస్థితీ అగమ్యగోచరంగా తయారైంది. వర్షాలు రాక కృష్ణాలో నీరు లేకపోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏటా వానాకాలం సీజన్లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోనే 11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈసారి కూడా 10.50 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా అంచనాలు తలకిందులయ్యాయి.
గతేడాది జూలై 14 నాటికి రెండు జిల్లాల్లో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ఈసారి ఇప్పటివరకు 40 వేల ఎకరాల్లో కూడా సాగు కాలేదు. వర్షాలు లేకపోవడం, సాగర్నుంచి నీటి విడుదలపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో ఆయకట్టు రైతులు వరిసాగు చేయడం లేదు. ఇక ఖమ్మం జిల్లాలోని ఆయకట్టుకు కూడా ఈసారి నీరు విడుదల కాలేదు. దీంతో బోర్లు, బావుల కింద కేవలం 40 వేల ఎకరాల్లో పంటలు వేశారు.
గోదావరి పరిస్థితీ అంతే..
మరోవైపు గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, కాళేశ్వరం బరాజ్లకు ఆశించిన స్థాయిలో వరద ప్రవాహాలు చేరడం లేదు. దీంతో ఖరీఫ్ సాగు, తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పునరుద్ధరణపై రైతుల్లో ఆందోళన నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్తో పాటు ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టుల్లో ప్రస్తుతం నిల్వలు గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. తొలకరి వర్షాలను నమ్ముకుని విత్తనాలు వేసిన రైతులు ఇప్పటికే నష్టపోయారు. వరి నాట్లు, పత్తి, మొక్కజొన్న, కంది, సోయాబీన్ వంటి ఆరుతడి పంటలు చాలాచోట్ల మొలకెత్తకుండానే దెబ్బతిన్నాయి.
ఖరీఫ్ సాగు అంచనా, సాగైన విస్తీర్ణం (ఎకరాల్లో)
సాగు అంచనా 1,32,38,446
ఇప్పటివరకు సాగైంది 59,83,971
వరి సాగు అంచనా 65,95,645
ఇప్పటివరకు సాగు 6,39,956
పత్తి సాగు అంచనా 47,41,541
ఇప్పటివరకు సాగు 41,12,099
రాష్ట్రంలో వర్షపాతం (1 జూన్–16 జూలై 2026)
సాధారణం 236.4మి.మీ.
నమోదు158.4మి.మీ.
లోటు 33 శాతం


