
అచ్చంపేట (మహబూబ్నగర్): పట్టపగలే ఓ వ్యక్తిపై గొడ్డలి, సుత్తితో దాడిచేసి హతమార్చిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 15న అచ్చంపేట మండలం నడింపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై చోటు చేసుకున్న హత్య కేసు వివరాలను శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులుతో కలిసి ఏఎస్పీ రామేశ్వర్ వెల్లడించారు. వివరాలిలా.. నడింపల్లి గ్రామానికి చెందిన బూరం వీరయ్య చిన్న కుమారుడు పరమేశ్ అదే గ్రామానికి చెందిన సుగూరు మహేశ్ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. గత నెల 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా గురుజాలకు ఆమెను తీసుకెళ్లాడు.
తన భార్య అదృశ్యంపై అచ్చంపేట పోలీస్స్టేషన్లో భర్త మహేశ్ ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న మహేశ్ బంధువులు గురుజాలకు వెళ్లి పరమేశ్పై దాడిచేసి సదరు మహిళను ఇంటికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పరమేశ్ వైఖరిలో మార్పు రాక పోవడం.. వాట్సప్ స్టేటస్లో ఈ నెల 15న మహిళతో ఉన్న ఫొటోలను పెట్టాడు. ఈ క్రమంలో భర్త మహేశ్ అదే గ్రామానికి చెందిన పదిర శివ, ఎడ్ల మహేశ్లతో కలిసి పరమేశ్ కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు పథకం రచించారు.
ఈ నెల 15న అచ్చంపేట నుంచి నడింపల్లికి బైక్పై వెళ్తున్న పరమేశ్ తండ్రి బూరం వీరయ్య, సోదరుడు వెంకటేశ్ ను కారు, బైక్తో వెంబడించారు. నడింపల్లి సమీపానికి రాగానే ఒక్కసారిగా వీరయ్యపై గొడ్డలి, సుత్తితో దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్పై దాడికి యత్నించగా.. సమీప గ్రా మస్తులు రావడంతో వదిలిపెట్టి వెళ్లారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులు గతంలో నేర చరిత్ర కలిగి ఉండటంతో వారిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.
నిందితులను అరెస్టుచేసి కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. హత్య కేసును చేధించిన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్, ఉప్పునుంతల ఎస్ఐ వెంకట్రెడ్డి, ఇందిర, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ రమేశ్, కానిస్టేబుళ్లు విశ్వనాథ్, బాలస్వామి, మల్లేష్, విష్ణు ఉన్నారు.