హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్కో (TRANSCO)లో డివిజనల్ ఇంజినీర్ (డీఈ)గా పనిచేస్తున్న ముత్యం వెంకటరమణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఆయన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న మీనాక్షి స్కై లాంచ్ అపార్ట్మెంట్లోని వెంకటరమణ నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన ఇతర ప్రదేశాల్లోనూ ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. కీలక పత్రాలు, బ్యాంకు లావాదేవీల వివరాలు, స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లాకర్ల సమాచారం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. తనిఖీలు పూర్తి అయ్యాక అధికారికంగా వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ఏసీబీ బృందాలు సేకరించిన ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.


