భీమ్రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏసీబీ
రూ.9.05 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు
సాక్షి, హైదరాబాద్: ‘డీఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తులకు సంబంధించి సోదాల సమయంలో సుమారు రూ.10.12 కోట్ల విలువైన ఆస్తులు, పెట్టుబడులు, బంగారు నగలు, నగదు, బ్యాంకు నిల్వలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇంటి సామగ్రి బయటపడ్డాయి. లెక్కకు వచి్చన ఆదాయం సుమారు రూ.2.10 కోట్లు, అంచనా ఖర్చు రూ.1.03 కోట్లని లెక్కించాం. మిగిలిన పొదుపుతో పోలిస్తే రూ.9.05 కోట్ల మేర అక్రమ ఆస్తులున్నాయి.
వీటిపై సరైన వివరణ ఇవ్వడంతో భీమ్రెడ్డి విఫలమయ్యారు. దీంతో ఏసీబీ 1988 చట్టంలోని సెక్షన్ 13(1)(బీ) రెడ్విత్ 13(2) కింద అతనిపై అభియోగాలు నమోదు చేశాం. దర్యాప్తునకు అవసరమైన సమాచారం ఇవ్వడంలో అతను సహకరించలేదు’అని కోర్టుకు ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక వివరాలు వెల్లడించింది. ఏసీబీ ఇన్స్పెక్టర్ గౌస్ అజాద్ దాఖలు చేసిన నివేదికలోని వివరాలిలా ఉన్నాయి.
పలు చోట్ల తనిఖీలు నిర్వహించాం
హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మణికొండ, పటాన్చెరు, జూబ్లీహిల్స్, అల్వాల్, గచ్చిబౌలి, గడ్డిఅన్నారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. భీమ్రెడ్డి నివాసంతోపాటు ఆయనతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహించాం. ఈ సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, వాణిజ్య స్థలాలు, బంగారు నగలు, లెక్కలోకి రాని నగదు, బ్యాంకు ఖాతాల వివరాలు దొరికాయి.
బినామీ ఆస్తులపై కీలక ఆధారాలు..
దర్యాప్తులో భాగంగా నిందితుడు, కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత వ్యక్తులకు చెందిన ఆస్తుల వివరాల వివరాలు సేకరించాం. కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నాం. డిజిటల్ పరికరాల్లోని సమాచారం, వీడియోలు, ఇతర డేటా పరిశీలన కోసం ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపాం. ఆస్తులను ఇతరుల పేర్లపై నమోదు చేసి, అనంతరం పేర్లు మార్చి వాటిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. గచ్చిబౌలిలోని ప్లాట్, విసెల్లా మెడోస్లోని విల్లా, జూబ్లీహిల్స్లోని ఫ్లాట్, మణికొండలోని భూమి, పటాన్చెరులోని ఆస్తులు, భార్య పేరు మీద ఉన్న ఫ్లాట్, వ్యవసాయ భూమి వంటి ఉన్నాయి. కొన్ని ఆస్తులు బినామీ పేర్లతో, మరికొన్ని ఆస్తులను ముందుగా తన పేరుతో కొనుగోలు చేసి తర్వాత క్యాన్సిలేషన్ డీడ్లతో ఇతరుల పేర్లకు మార్చారు.
అతని, కుటుంబ సభ్యుల పేర్లపై 10 బ్యాంక్ ఖాతాలున్నాయి. కొన్ని ఆస్తుల యాజమాన్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోదాల సమయంలో ఆయనకు ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె దడ వంటి సమస్యలు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలించాం. వైద్య కారణాలతో అరెస్టు ఆలస్యమైంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. మరిన్ని సాక్ష్యాలు, పత్రాలు, బ్యాంకు ఖాతాల పరిశీలన అవసరం. అతను బయట ఉంటే.. విచారణను ప్రభావితం చేసే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగులోకి రావాలంటే 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అవసరం. కాగా రిమాండ్ రిపోర్టులో పలు ఆస్తులకు సంబంధించి హోంగార్డు లక్ష్మణ్, ఇంద్రకరణ్రెడ్డి, నరేందర్రెడ్డి, హర్షిత పేర్లను ప్రస్తావించారు.


