
ఆశాజనకంగా యాసంగి సన్నాల సాగు
ఈసారి తప్పిన చీడపీడల బెడద..బోనస్ భరోసా
రాష్ట్రవ్యాప్తంగా ఈ యాసంగిలో 56.69 లక్షల ఎకరాల్లో వరిసాగు
ఇందులో 60 శాతం వరకు సన్నధాన్యం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఈ యాసంగిలోనూ సాగు చేసే సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభు త్వ ప్రకటన నేపథ్యంలో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 56.69 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా, అందులో దాదాపు 40 ల క్షల ఎకరాల్లో సన్నాలే ఉన్నాయి. నీటివనరులు అందుబాటులో ఉండటం, తెగుళ్లు లేకపోవడంతో దిగుబడి ఎక్కువగా వస్తుందన్న ఆశలో రైతులు ఉన్నారు.
వానాకాలంలో 66.77 లక్షల ఎకరాల్లో...
2024–25 వానాకాలం సీజన్లో 66.77 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 40.44 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. ప్రభుత్వం అప్పుడే సన్నరకం ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ను ప్రకటించింది. అయితే కొన్నిచోట్ల అధిక వర్షాలు, మరికొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు, దోమకాటు, అగ్గి, ఎర్ర తెగుళ్ల కారణంగా దిగుబడి అనుకున్న స్థాయిలో రాలేదు. సన్నధాన్యం సాగుతో మద్దతు ధరతోపాటు క్వింటాల్కు రూ.500 బోనస్ వస్తుందనుకున్న రైతులకు కొంత నిరాశ మిగిల్చించంది.
ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో సాగు
యాసంగి సీజన్ అంటే.. సహజంగా ఆరుతడి పంటలను సాగు చేస్తారు. గత కొన్నేళ్ల పంటల సాగును పరిశీలిస్తే యాసంగిలో సన్నధాన్యం సాగు 15 శాతంలోపే ఉండేది. అయితే రూ.500 బోనస్, వాతావరణం అనుకూలించడం, నీటివసతి కూడా ఉండటంతో ఈ యాసంగిలో వరిసాగు విస్తీర్ణం 56.69 లక్షల ఎకరాలు కాగా, అందులో 60 శాతం వరకు (40 లక్షల ఎకరాలే) విస్తీర్ణంలో సన్నాలు సాగయ్యాయి.
యాసంగిలో సన్న రకాలు సాగు చేయడం ఇదే రికార్డు. గత ఏడాది యాసంగిలో మొత్తం 51.92 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఈ యాసంగిలో 54.83 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గతేడాది కంటే అధికంగా 1.86 లక్షల ఎకరాల్లో సాగైంది.
ఈసారి రైతులకు కలిసొచ్చింది
ఈ యాసంగిలో వరిసాగు చేసిన రైతులకు కలిసొచ్చింది. ఎక్కువగా అకాల వర్షాలు, గాలిదుమ్ము లేకపోవడంతో పంట నష్టం వాటిల్లలేదు. ప్రతి ఏటా ఇబ్బందికరంగా మారుతున్న తెగుళ్లు ఈసారి ఎక్కువగా పంటలకు సోకలేదు. దీంతో మందులు పిచి కారీ చేయడం, పంట దెబ్బతినడం వంటి ఆందోళన ఈసారి లేదు. ఈ క్రమంలో వానాకాలం సీజన్తో పోలిస్తే ఈసారి అనుకూలంగా ఉన్నట్టు రైతులు పేర్కొంటున్నారు.
దిగుబడి ఆశించిన మేరకు రావడం, సన్నాలకు బోనస్ ఇవ్వనుండటంతోపాటు మద్దతు ధర లభించడంతో రైతులకు కలిసి రానుంది. వానాకాలం ఎకరాకు సగటున 20 క్వింటాళ్ల నుంచి 23 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా..ఈసారి సగటున 26 క్వింటాళ్ల నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందన్న ఆనందం రైతుల్లో వ్యక్తమవుతోంది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన లింగం యలమంద 2024–25 వానాకాలం సీజన్లో 10 ఎకరాల్లో వరి సాగు చేశాడు. వివిధ రకాల తెగుళ్లు, వర్షాలు, వరదల కారణంగా 200 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన బోనస్తో కొంత ప్రయోజనం చేకూరింది.
ఈ యాసంగిలో 10 ఎకరాల విస్తీర్ణంలో మళ్లీ సన్నాలు సాగు చేశాడు. ఈసారి 260 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని చెబుతున్నాడు. ధాన్యాన్ని విక్రయించేందుకు నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్న డీసీఎంఎస్ కేంద్రానికి వచ్చాడు. బోనస్ భరోసా, పెరిగిన దిగుబడితో ఆనందంగా ఉన్నాడు.
ఈసారి ఖర్చులు తక్కువే
ఈ యాసంగిలో నాకున్న ఎకరం విస్తీర్ణంలో సన్నరకం సాగు చేయగా.. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వానాకాలంలో 24 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. వర్షాలు, వరదలతోపాటు తెగుళ్లు ఇబ్బంది పెట్టడం వల్ల దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు కూడా అధికమయ్యాయి. అయితే ఈ యాసంగిలో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉండటం, తెగుళ్లు లేకపోవడంతో 6 క్వింటాళ్లు అధికంగా దిగుబడి వచ్చింది. ఖర్చులు కూడా అంతగా లేవు. –అర్వపల్లి నరేష్, కూసుమంచి