జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లను తొలగించండి | Eliminate fraudulent votes in Jubilee Hills says ktr | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లను తొలగించండి

Oct 14 2025 4:39 AM | Updated on Oct 14 2025 4:39 AM

Eliminate fraudulent votes in Jubilee Hills says ktr

బూత్‌కు 50 ఓట్ల చొప్పున 20 వేల ఓట్లు చేర్చారు 

నామినేషన్ల గడువు ముగిసేలోగా దీనిపై చర్యలు తీసుకోవాలి 

లేదంటే ఓటరు జాబితా అక్రమాలపై కోర్టుకు వెళ్తాం 

ఎన్నికల సంఘం సీఈవోకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అడ్డదారుల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌ పార్టీ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని 400 పోలింగ్‌ బూత్‌లలో 50 చొప్పున 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు.

జాతీయ స్థాయిలో రాహుల్‌ గాంధీ ‘ఓట్‌ చోరీ’పై మాట్లాడుతుంటే జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్‌ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. డూప్లికేట్‌ ఓటర్ల నమోదు, ఇతర అవకతవకలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి పార్టీ నేతలతో కలిసి కేటీఆర్‌ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఓటర్‌ లిస్టుపై సమగ్ర దర్యాప్తు చేయాలి 
‘ఒక్కో వ్యక్తికి మూడు నాలుగు ఓటర్‌ గుర్తింపు కార్డులున్నాయి. వేర్వేరు అడ్రస్‌లపై ఒకే వ్యక్తి ఓటు నమోదు, కొద్దిపాటి మార్పులతో ఒకే వ్యక్తి పేరు పలు చోట్ల నమోదు వంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఒక్కో ఇంట్లో వందకు పైగా ఓట్లను నమోదు చేసినట్లుగా వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంటి యజమానులకు కూడా తెలియకుండా వారి చిరునామాపై ఓట్లు నమోదు అయ్యాయి. 

కాంగ్రెస్‌ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానంగా ఉంది. ఓటర్‌ జాబితా అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల సంఘాన్ని కోరాం’అని కేటీఆర్‌ తెలిపారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో చేరి అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ఓటర్‌ జాబితా అక్రమాలపై నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 

దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. కేటీఆర్‌ వెంట బీఆర్‌ఎస్‌ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దాసోజు శ్రవణ్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి, కిషోర్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement