
పదవులు దక్కిన తర్వాత దూరంగా ఉండటంపై బీజేపీ అధినాయకుల ఆగ్రహం?
కష్టపడే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలనే వాదన
డివిజన్ అధ్యక్షుల తీరుపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుండగా, మరోవైపు కొందరు పదవులు దక్కిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అసంతృప్తి శ్రేణుల్లో నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షుల వ్యవహార శైలిపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో ఏడాదిలో గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు పార్టీ పరంగా గ్రౌండ్ వర్క్ (Ground Work) చేసుకోవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. డివిజన్, జిల్లాలవారీగా విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలాబలాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాలపైనా చర్చిస్తున్నారు. ఇలాంటి సమంలో పార్టీ పదవుల్లో ఉన్నవారు సమావేశాలకు గైర్హాజర్ కావడమేంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారే పార్టీ పదవుల్లో కొనసాగాలని, అలా కుదరదంటే స్వచ్ఛందంగా తప్పుకోవాలనే వాదలు గట్టిగా వినిపిస్తున్నారు.
ఇటీవల కాషాయ పార్టీ మీటింగ్లో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender ) సైతం ఇదే స్వరాన్ని వినిపించారు. మేడ్చల్ అర్బన్ జిల్లాలో బీజేపీ 25 డివిజన్లుగా విభజించింది. కొత్తగా డివిజన్ అధ్యక్షులను ఎంపిక చేసింది. అనంతరం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కొత్తగా ఏర్పాటైన వారిలో 9 మంది డివిజన్ అధ్యక్షులు హాజరు కాలేదు. దీంతో ఒకింత ఆగ్రహానికి గురైన ఈటల రాజేందర్ 70 వేల మందికి ప్రాతినిథ్యం వహించే డివిజన్ అధ్యక్షుడు పార్టీ సమావేశాలకు హాజరు కాకుంటే ఎలా, అత్యవసర పరిస్థితుల్లో రాలేనివారిని మినహాయిస్తే, మిగతావారిని ఊపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
చదవండి: వారి మద్దతుతోనే ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు
దీంతో పార్టీలో ఆ 9 మంది డివిజన్ అధ్యక్షుల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. భాగ్యనగరంలోని మిగతా డివిజన్ల పరిస్థితిపైనా నిశితంగా పరిశీలించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నవారిని పక్కన పెట్టి పార్టీకి పనిచేసే వారికి పట్టం గట్టాలని పార్టీ అధిష్టానం (High Command) భావిస్తోందని నేతలు పేర్కొంటున్నారు. నేతలు సొంత పార్టీ వారే అయినా కొన్ని దఫాలు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందంటున్నారు. పదవి పొందేటప్పుడు ఉన్న ఆరాటం ఆ తర్వాత ఉండటం లేదని, పార్టీ కోసం 24 గంటలు పని చేయాల్సిందేనని పార్టీ అధిష్టానం స్పష్టం చేస్తోంది.