
సాక్షి, ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వర్సిటీలో విద్యార్థులపై పోలీసులు దుందుడుకుగా వ్యవహరించవద్దని సూచనలు చేశారు. అలాగే, హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో సాక్షితో మాట్లాడుతూ..‘గతంలో చంద్రబాబు బిల్లి రావుకు అప్పనంగా 400 ఎకరాలు కట్టబెట్టాడు. భారత్ ఐఎంజీ బోగస్ కంపెనీ అని నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆ భూములను రద్దు చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడారు. ఆ వెంటనే భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోకుండా, ప్రైవేటు వారికి లాభం కలిగేలా ఉపేక్షించింది. ప్రైవేటు వారికే ఆ భూములు కట్టబెట్టేలా బీఆర్ఎస్ పని చేసింది. మేం అధికారంలోకి రాగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాటం చేసి 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలిగింది.
ఆ భూములతో హైటెక్ సిటీ ప్రాజెక్టును విస్తరించి ఐటీ కంపెనీలకు అప్పగిస్తాం. హెచ్సీయూకు సంబంధించిన ఇంచు భూమిని కూడా మేము తీసుకోము. పర్యావరణాన్ని, జీవజాలాన్ని కాపాడుతాం. విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తాం. విద్యార్థులపై పోలీసులు అనుచితంగా వ్యవహరించవద్దు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో అక్కడున్న విద్యార్థులను కొందరు రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి కోసమే భూములను వినియోగిస్తాం. హెచ్సీయూకు ఇప్పటికే వేరే భూములను బదలాయించారు’ అని చెప్పుకొచ్చారు.