హైదరాబాద్‌లో కాస్మొటిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ | Cosmetic manufacturing hub in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కాస్మొటిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌

Jan 24 2024 4:35 AM | Updated on Jan 24 2024 4:35 AM

Cosmetic manufacturing hub in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్‌ తయారీ సంస్థ డూసన్‌ హైద రాబాద్‌లో కాస్మొటిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి కాస్మొటిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌ను దాదాపు రూ. 5 వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటా మన్నారు.

మంగళవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో డూసన్‌ ప్రతినిధులు సమావేశమై తమ పెట్టుబడుల గురించి ప్రభుత్వా నికి సవివరమైన నివేదిక (డీపీఆర్‌)ను అందజే శారు. తాము కల్పించే ఉద్యోగాలు, పెట్టుబడుల ద్వారా స్థానికులకు కలిగే ప్రయోజనాల గురించి మంత్రికి విజువల్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

తమ సంస్థ చైనా, వియత్నాం, కంబోడియా తదితర దేశాల్లో 46 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, తమ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.  హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవసర మైన అనుమతులు, కంపెనీ ఏర్పాటుకు భూకేటా యింపులు, రాయితీల గురించి  మంత్రితో డూసన్‌ ప్రతినిధులు చర్చించారు.

వేల మందికి ఉపాధి కల్పిస్తాం: డూసన్‌ ప్రతినిధి
తమ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కాస్మొటిక్‌ హబ్‌ ద్వారా ప్రత్యక్షంగా దాదాపు 3 వేల మందికి... పరోక్షంగా మరో 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని డూసన్‌ ప్రతినిధి మూన్‌ కీ జూ తెలిపారు. ఒరిజనల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ (ఓఈఎం), ఒరిజనల్‌ డిజైన్‌ మాన్యుఫాక్చరర్స్‌ (ఓడీఎం) పద్ధతిలో తమ సంస్థ కార్యకలాపాలు ఉంటాయన్నారు.

సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలను ఉత్పత్తి చేసే రైతుల నుంచే కొనుగోళ్లు చేస్తామని... తద్వారా స్థానిక రైతులు, ఉత్పత్తిదారులకు మరింత ఉపాధి పెరుగుతుందని మంత్రికి వివరించారు. ఇక్కడ ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను స్థానికంగా వ్యాపారం చేయడంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తామని తెలియజేశారు. 

అనుమతుల మంజూరుకు మంత్రిహామీ
దేశంలోకెల్లా తెలంగాణ సులభతర వాణిజ్యంలో మొదటిస్థానంలో ఉందని, పరిశ్రమలకు సింగిల్‌ విండో విధానం ద్వారా అనుమతులను మంజూరు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వారికి తెలియజేశారు.

దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని, హైదరాబాద్‌ పారిశ్రామిక వాతావరణం, పారిశ్రామిక విధానం ఇతర దేశాలు, వ్యాపార సంస్థలకు స్వర్గధామంగా ఉందని డూసన్‌ ప్రతినిధులకు వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సమావేశం ఏర్పాటు చేసి కంపెనీ ఏర్పాటు చేయడానికి కావల్సిన అనుమ తులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement