రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏకే ఖాన్‌ కుమారుడిపై చీటింగ్‌ కేసు | Cheating case against retired IPS officer AK Khans son | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఏకే ఖాన్‌ కుమారుడిపై చీటింగ్‌ కేసు

Jul 3 2026 2:51 AM | Updated on Jul 3 2026 2:52 AM

Cheating case against retired IPS officer AK Khans son

మోసం చేసి, బెదిరించాడంటూ సినీ నిర్మాత ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌: రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏకే ఖాన్‌ కుమారుడు, మాజీమంత్రి షబ్బీర్‌ అలీ అల్లుడు మొహసిన్‌ ఖాన్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన బంధువు తబ్రేజ్‌ సైతం నిందితుడిగా ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సినీనిర్మాత వెంకట అనీశ్‌రెడ్డి ఇటీవల ‘మహారాగ్ని’సినిమా నిర్మించారు. ఆ సమయంలో పెట్టుబడిదారుల కోసం అన్వేషించారు. అప్పట్లో అనీశ్‌కు మొహిసిన్ ఖాన్, తబ్రేజ్‌లతో పరిచయం ఏర్పడింది. సన్‌లిట్‌ గ్రూప్‌ ఎండీగా తనకు విస్తృతమైన పరిచయాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లను పరిచయం చేస్తానని చెప్పి మొహసిన్‌ ఖాన్‌ రూ.25 లక్షలు అనీశ్‌ వద్ద తీసుకున్నారు.

తబ్రేజ్‌కు రూ.25 లక్షలు మూడు విడతల్లో ఇచ్చినట్లు బాధితుడు చెబుతున్నాడు. డబ్బులు తీసుకున్నా, పెట్టుబడిదారులను పరిచయం చేయకుండా ఇద్దరూ తప్పించుకుంటున్నారని అనీశ్‌ ఆరోపించారు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని సన్‌లిట్‌ గ్రూపు కార్యాలయానికి ఈ నెల 1న తాను వెళ్లానని.. ఆ సమయంలో ఆయన తన పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా చెయ్యి చేసుకున్నాడని అనీశ్‌ ఆరోపించారు. డబ్బులు అడుగుతావా..ఏం చేస్తావో చూద్దామంటూ బెదిరించడమే కాకుండా బౌన్సర్లతో అడ్డగించి మారణాయుధాలు చూపించి భయబ్రాంతులకు గురి చేశాడని, దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నాడు. 

మొహసిన్‌ ఖాన్‌ తన దవడపై బలంగా కొట్టాడని, బౌన్సర్లు కూడా చేతులతో దాడి చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తబ్రేజ్‌ కూడా ఫోన్‌కాల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడని అనీశ్‌ ఆరోపించారు. తనకు మొహసిన్‌తోపాటు తబ్రేజ్‌ల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మొహసిన్‌ ఖాన్‌పై గతంలోనూ ఓ క్రిమినల్‌ కేసు ఉంది. టోలిచౌకికి చెందిన వ్యాపారి మొహమ్మద్‌ అబ్దుల్‌ వహాబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 2022 సెపె్టంబర్‌లో ఈ కేసు నమోదైంది. ఇసుక తవ్వకాల వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన మొహసిన్‌ రూ.90 లక్షలు పెట్టుబడిగా తీసుకున్నట్టు వహాబ్‌ ఆరోపించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement