నగరంలో అంబారీపై సాగుతున్న చారిత్రక ఘట్టం
ఈ నెల 26న బీబీ కా అలం ఊరేగింపునకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. రాజులు మారారు. రోజులు మారాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ.. 1594 నుంచి ఒక్క ఏడాది కూడా ఆగకుండా భాగ్యనగర గుండెల్లో నడిచే చరిత్ర ఇది. కుతుబ్ షాహీల వారసత్వం, నిజాం పాలనకు ముగింపు పలికినా చెక్కుచెదరని సంప్రదాయం బీబీ కా అలం. వజ్రాలు, వైఢూర్యాలు పొదిగిన అలంతో ఏనుగుపై సాగే ఈ ఊరేగింపు ఈ నెల 26న మరోసారి నగర వీధుల్లో పునరావృతం కానుంది. మొహర్రం సందర్భంగా ఈ ఏడాది కేరళ నుంచి ప్రత్యేకంగా ఏనుగును తీసుకురావడం విశేషం.
వజ్ర, వైఢూర్యాల వైభవం..
మహ్మద్ ప్రవక్త కుమార్తె బీబీ ఫాతిమా కాలం చేసిన అనంతరం ఆమె చివరి స్నానంగా వినియోగించిన బల్లను ఆరో కుతుబ్ షాహీ రాజు మహమ్మద్ కులీ తల్లి హయత్ భక్షి బేగం కోరిక మేరకు తీసుకొచ్చి దాంతోనే తయారు చేసిన అలంను ఆమె జ్ఞాపకార్థం నగరంలో 1594లో ప్రతిíÙ్ఠంచారు. నిజాం పాలకులు బహుమతిగా ఇచి్చన వజ్రాలు, వైఢూర్యాలు, అరుదైన రత్నాలు అలం చుట్టూ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
ఏడాది పొడవునా దబీర్పురాలోని బీబీ కా అలావాలో పోలీసుల ఆర్మ్డ్ గార్డ్ రక్షణలో భద్రంగా ఉంచి, ఊరేగింపు రోజు మాత్రమే వీటిని బయటకు తీస్తారు. పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, రెవెన్యూ శాఖల సమన్వయంతో 432 ఏళ్లుగా ఊరేగింపు కొనసాగుతోంది. ఈ నెల 26న దబీర్పురా నుంచి చార్మినార్, గుల్జార్ హౌజ్ మీదుగా చాదర్ఘాట్ వరకు సాగే ఊరేగింపునకు 2వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంప్రదాయం హైదరాబాద్ మత సామరస్యానికి, గంగా జమునా తెహజీబ్కు నిలువెత్తు నిదర్శనం.


