ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ' | Bhatti Vikramarka Speech In Tg 20 Cricket League Event | Sakshi
Sakshi News home page

ఒలింపిక్సే లక్ష్యంగా తెలంగాణలో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'

Jun 21 2026 9:53 PM | Updated on Jun 21 2026 9:53 PM

Bhatti Vikramarka Speech In Tg 20 Cricket League Event

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంతాల్లో సరైన అవకాశాలు లేక మరుగున పడిపోతున్న ప్రతిభాపాటవాలను వెలికితీసి, వారికి సరైన శిక్షణనిచ్చి ప్రపంచానికి పరిచయం చేయడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో ఒలింపిక్స్ బరిలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం" అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

​ఉప్పల్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన 'టీజీ 20 క్రికెట్ లీగ్' మెగా టోర్నమెంట్‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్తుకు ఈ లీగ్ ఒక బలమైన పునాది కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

​"గతంలో క్రికెట్ అంటే కేవలం నగరాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ, ఆ పరిస్థితులను మారుస్తూ మొదటిసారిగా మా ప్రభుత్వం ప్రతి జిల్లా నుంచి క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించింది. జిల్లాల వారీగా జట్లను (టీమ్‌లను) ఎంపిక చేసి గ్రామీణ యువతకు ఈ మెగా వేదికను కల్పించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం క్రీడలను పెద్దపీట వేస్తూ, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కట్టుబడి ఉంది" అని భట్టి విక్రమార్క తెలిపారు.

​గతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫుట్‌బాల్ స్టార్ 'మెస్సి' ఆడిన ఈ ఉప్పల్ స్టేడియం సాక్షిగా.. హైదరాబాద్ నగరంలో ప్రపంచ స్థాయి వసతులు, అన్ని హంగులతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఒలింపిక్స్ స్థాయి శిక్షణ ఇచ్చేలా తెలంగాణలో ఒక బలమైన క్రీడా వ్యవస్థను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.

​మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ 'టీజీ 20 క్రికెట్' హంగామా.. రాష్ట్రంలోని క్రీడాభిమానులకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ టోర్నీ విజయవంతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement