నేడే మద్యం లాటరీలు  | Arrangements for Draw under the supervision of Collectors in District Centres | Sakshi
Sakshi News home page

నేడే మద్యం లాటరీలు 

Aug 21 2023 1:40 AM | Updated on Aug 21 2023 9:55 AM

Arrangements for Draw under the supervision of Collectors in District Centres - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): రానున్న రెండేళ్ల కాలానికిగాను లైసెన్సుల మంజూరు కోసం నేడు(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా 2,620 వైన్‌షాపులకు లాటరీలు నిర్వహించనున్నారు. ఈ నెల 4న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 18వ తేదీన ముగిసిన నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ‘డ్రా’తీయనున్నారు.

జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో వీడియో చిత్రీకరణ ద్వారా ఈ లాటరీల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని, లాటరీలో విజేతలకు వెంటనే షాపుల కేటాయింపు ఉత్తర్వులు అందజేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు.

ఎంట్రీ పాసులు ఉన్నవారిని మాత్రమే డ్రా తీసే ప్రదేశంలోకి అనుమతించాలని, లాటరీ ప్రక్రియ విషయంలో చిన్న పొరపాటు జరిగినా సంబంధిత అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. కాగా, మంత్రి ఆదివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో కూడా ఎక్సైజ్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాటరీ ప్రక్రియ కు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement