సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ (TEC) చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను సీఎస్కు పంపించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. మేము విద్యపై సిఫార్స్లతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాము. నాకు అప్పగించిన పనిని పూర్తిచేసినందున తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ విద్యా రంగంలో కీలక పాత్ర పోషించిన ఆకునూరి మురళి 2024లో టీఈసీ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండు సంవత్సరాలు కాగా ఇవాళ (మే22)సమగ్ర నివేదిక సమర్పించి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.
ఆకునూరి మురళి రాష్ట్రంలోని ప్రాథమిక నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టారు. ఆయన కరికులం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోధన పద్ధతులు మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. దీర్ఘకాలిక విద్యా విధాన రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. రాజకీయ ప్రభావం లేకుండా స్వతంత్ర నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేసి పాఠశాలల పనితీరును పర్యవేక్షించారు.
ఆయన చైర్మన్గా ఉన్న సమయంలో 100 మోడల్ స్కూల్స్ ఏర్పాటు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పేద కుటుంబాల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించే ప్రయత్నం చేశారు. ఆకునూరి మురళి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించి, అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ, విద్యా రంగంలో సేవ చేయడం గౌరవంగా భావించినట్లు తెలిపారు.


