Outsourcing Employees Protest At Telangana University In Nizamabad - Sakshi
Sakshi News home page

కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి

Jun 15 2023 9:22 AM | Updated on Jun 15 2023 10:59 AM

Daily Wage Workers Protest Against Telangana University VC - Sakshi

తెయూ వీసీ రవీందర్‌ కాళ్లపై పడి తమ డబ్బులు తిరిగివ్వాలని వేడుకుంటున్న బాధితులు 

సాక్షి, నిజామాబాద్‌ (డిచ్‌పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్‌ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్‌ క్యాంపస్‌కు చేరుకున్నారు.

ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్‌ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్‌ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్‌ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు.

పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్‌ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్‌ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు.
చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్‌చార్జి

Advertisement
 
Advertisement
Advertisement