చంద్రబాబు ప్రభుత్వంపై పలువురు నాయకుల ఆగ్రహం
జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతుల నిరసన మహాదీక్ష
జంగారెడ్డిగూడెం: వ్యాపారులు సిండికేట్గా మారి పొగాకు ధరను తగ్గించేసి రైతుల పొట్టకొడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులు నిరసన మహాదీక్ష చేపట్టారు. చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల రైతు సంఘాలు, వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ కంభం విజయరాజు నాయకత్వంలో రైతులు సుమారు 800 ట్రాక్టర్లు, కార్లు, బైకులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా రైతులు రోడ్డుపై పొగాకును దహనం చేశారు. అనంతరం బహిరంగ సభలో నాయకులు మాట్లాడుతూ... కేజీ పొగాకు ఈ ఏడాది రూ.260కి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వర్జీనియా పొగాకుకు కనీస మద్దతు ధర కేజీకి రూ.300 ప్రకటించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులకు కేంద్రం రూ.1,000 కోట్ల నిధులు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


