సూర్యాపేట అర్బన్ : ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్లో నిర్వహించిన పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, వసతుల లేమి వంటి అనేక సమస్యలు పేరుకుపోయాయన్నారు. పీహెచ్సీల్లో వైద్యులు, సిబ్బంది ఖాళీలు, మందుల కొరత, 24 గంటల వైద్య సేవలు అందకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాను జయప్రదం చేయాని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి నాగార్జునరెడ్డి


