ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో రెవెన్యూ సిబ్బంది పడుతున్న కష్టాలు తీరనున్నాయి. జిల్లాలో నాలుగు మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆత్మకూర్ ఎస్, మద్దిరాల, మోతే మండలాలతో పాటు మట్టంపల్లి మండలంలో నూతన తాహసీల్దార్ కార్యాలయాలకు రూ.2.25 కోట్లను విడుదల చేసింది.
ఇరుకు గదులతో అవస్థలు
గతంలో నిర్మించిన భవనాలు, నేటి అవసరాలకు అనుకూలంగా లేకపోవడంతో అధికారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డులు భద్రపరిచేందుకు, కంప్యూటర్లు, సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు స్థలం లేక అవస్థలు పడుతున్నారు. దానికి తోడు పాత భవనాలు కావడంతో శిథిలావస్థకు చేరి వర్షం వస్తే కురుస్తున్నాయి. దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అధికారులు, కార్యాలయాలకు వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆయా మండలాల్లో కొత్త భవనాలకు నిధులు మంజూరైనందున వెంటనే పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఫ రెవెన్యూ కార్యాలయాలకు
పక్కా భవనాలు
ఫ నాలుగు మండలాలకు
రూ.2.25 కోట్లు మంజూరు


