కోదాడరూరల్ : చేనేత ఐక్యవేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కోదాడ చెందిన అన్నబత్తుల వేణు నియమితులయ్యారు. ఆదివారం చౌటప్పల్లో జరిగిన రాష్ట్ర చేనేత సహకార సభ్యుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ సమక్షంలో కమిటీని ఎంపిక చేశారు. అనంతరం వేణుకు నియామక పత్రాన్ని అందించారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
నూతనకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏడీ రఘుబాబు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగులో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల అవసరాల నిమిత్తం ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఇసుకను పొందాలని ఆయన సూచించారు. అక్రమంగా ఇసుక నిల్వలు చేసి విక్రయించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఓలు బాబు, రవి, రాంబాబు, లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.
మహిళల భద్రతలో
ప్రభుత్వాలు విఫలం
చిలుకూరు : మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తెల సృజన విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో నిర్వహించిన మహిళా సమాఖ్య మండల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతా చట్టాలను కఠినంగా అమలు చేయాలని, వారిపై జరుగుతున్న అన్యాయాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన మహిళలందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. అనంతరం మహిళా సమాఖ్య మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షురాలిగా నంధ్యాల ఉషాలక్ష్మి, ఉపాధ్యక్షురాలిగా రణబోతు అనిత, ప్రధాన కార్యదర్శిగా అనంతు పుష్పలత, సహాయ కార్యదర్శిగా కాంపాటి నాగమణి, కోషాధికారిగా మజ్రపు స్వప్న, కార్యవర్గ సభ్యులుగా శైలజ, యశోద, హైమావతి, గౌరవ సలహాదారులుగా గ్రామ సర్పంచ్ గుగులోతు లలిత, ఉప సర్పంచ్ ఉద్దండు దుర్గను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి, వర్కింగ్ అధ్యక్షురాలు లక్ష్మి, మాజీ సర్పంచ్ రెమిడాల జయసుధ పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజిత జనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు.


