సూర్యాపేటటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు విద్యతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు పొందడానికి వీలుగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల సార్వత్రిక అధ్యయన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బేసిక్ కంప్యూటర్స్, జీఎస్టీ అసిస్టెంట్ అకౌంట్, సోలార్ టెక్నీషియన్, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ వంటి విభాగాలలో శిక్షణ ఇస్తున్నామని, ఈ మేరకు స్వామీ రామానంద తీర్థ గ్రామీణ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. విద్యార్థినులకు టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని, బీఎస్సీ ఎంపీసీ, బీజెడ్సీ, బీకాం కంప్యూటర్స్ విద్యార్థులకు సైన్స్ ప్రాక్టికల్స్ ల్యాబ్ను ఈ సంవత్సరం నుంచి ఎస్వీ కళాశాల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కోయ, చెంచు, ఆదివాసి గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు. ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్ పొందడానికి ఆగస్టు 7 చివరి తేదీగా ఉందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ వి.వెంకటేషులు, అధ్యాపకులు కిషోర్రెడ్డి, డాక్టర్ అనిల్, మల్లయ్య, సార్వత్రిక అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ ఎన్ఎస్ఆర్ శాస్త్రి, కౌన్సిలర్లు బుక్క ఉపేందర్, వడ్డానం శ్రీనివాస్, మధు, సుఖేష్ పాల్గొన్నారు.
ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థి
సేవావిభాగం డైరెక్టర్ వెంకటేశ్వర్లు


