నల్లగొండ(సూర్యాపేటటౌన్) : సూర్యాపేట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో అద్దె భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. అద్దె భవనంలో మౌలిక వసతులు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు గదులు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ అవి కూడా శిథిలావస్థకు చేరి పై కప్పు నుంచి వర్షపు నీరు కారుతుండడంతో తరగతుల నిర్వహణ కష్టంగా మారుతోంది. దాంతో చెట్ల కిందే పాఠాలు చెప్పాల్సి వస్తోంది.


