సూర్యాపేట (భానుపురి) : రాయితీ దుర్వినియోగం, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఈ– కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు గానూ ఈ నెలాఖరుతో గడువు ముగియనుంది. 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకు రాగా లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. అయినా ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో 89.2శాతం గ్యాస్ కనెక్షన్లకే ఈ–కేవైసీ చేయించారు. ఈ నెల 30లోగా చేయించుకోని లబ్ధిదారులు రాయితీ పొందే అవకాశం లేకుండా పోనుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా గ్యాస్ కొరత, ధరల పెరుగులకు తోడు రాయితీ కూడా అందకుంటే లబ్ధిదారులకు మరింత భారం కానుంది.
జిల్లాలో 4,15,509 గ్యాస్ కనెక్షన్లు
సూర్యాపేట జిల్లాలో 28 గ్యాస్ ఏజెన్సీ ఇండేన్, భారత్, హెచ్పీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాలశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 4,15,509 యాక్టివ్ కనెక్షన్లు ఉన్నాయి. గృహ వినియోగ గ్యాస్ను కమర్షియల్గా వాడుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీ సొమ్మును పక్కదారి పట్టించడం వంటి ఘటనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ–కేవైసీ విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ విధానంలో లబ్ధిదారుని గ్యాస్ కనెక్షన్కు ఆధార్ వివరాలు జత చేయడమే కాకుండా వేలిముద్రలు, ఐరిష్ ద్వారా అనుసంధానం చేస్తారు.
నిలిచిపోనున్న సబ్సిడీ
ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ మూడేళ్ల నుంచి కొనసాగుతోంది. అయినా జిల్లాలో పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 30లోపు వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వినియోగదారుల ఫోన్లకు మేసెజ్లు పంపిస్తున్నారు. ఈ లోగా ఈ–కేవైసీ చేయించుకోకుంటే రాయితీ డబ్బులు నిలిచి పోవడంతో పాటు గ్యాస్ బుకింగ్ సమయంలోనూ ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు.
ఫ ఎల్పీజీ ఈ–కేవైసీకి మరో
రెండు రోజులే అవకాశం
ఫ ఇప్పటి వరకు 89.2 శాతం
కనెక్షన్లకే ఈ–కేవైసీ
ఫ చేయించకుంటే రాయితీ కట్


