సూర్యాపేట, అర్వపల్లి : ఐదేళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రులు విధిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్యాశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ఆదివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా–శిశు ఆరోగ్య కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అర్వపల్లిలోని పోలియో బూత్ను సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 95,281 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించినట్లు, జిల్లాలో 575 కేంద్రాలను ఏర్పాటు చేసి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. తొలి రోజు పోలియో చుక్కలు వేయించని వారి ఇళ్లకు ఈ నెల 29, 30 తేదీలలో సిబ్బంది వెళ్లి చిన్నారులకు చుక్కలు వేస్తారన్నారు. మొదటిరోజు చుక్కలు వేయించని తల్లిదండ్రులు మిగిలిన రెండు రోజుల్లో వేయించి పోలియో రహిత సమాజం కోసం పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ నివేదిత, వైస్ చైర్మన్ షఫీఉల్లా, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కోటిరత్నం, డాక్టర్ వాసవి, స్టాటిస్టికల్ ఆఫీసర్ బాసిత్, ఆరోగ్యశాఖ అధికారులు, అర్వపల్లిలో మండల వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, సూపర్వైజర్ లలిత, కుంభం వీరయ్య, జ్యోతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్ఓ వెంకటరమణ


