‘పచ్చ’ పందేరం!
● రొళ్ల మండలం జీఎన్ పాళ్యం పరిసరాల్లో ఈనెల 1వ తేదీన కోడిపందెం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు కోడిపుంజులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన పలువురు అక్కడి నుంచి పరారీ అయ్యారు.
● తలుపుల మండలం ఎగువ నిగ్గిడి సమీపంలో ఈనెల 1న కోడిపందెం స్థావరాలపై పోలీసులు దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు పందెం కోళ్లతో పాటు రూ.2,290 నగదు స్వాధీనం చేసుకున్నారు.
సాక్షి, పుట్టపర్తి: జిల్లాలో కూటమి నేతలు బరి తెగించారు. గోదావరి జిల్లాల తరహాలో కోడిపందేల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎలాంటి అనుమతులు లేకున్నా.. గుట్టు చప్పుడు కాకుండా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. పండుగ సమయంలో నాలుగైదు రోజులు నిరంతరంగా ఆడించేందుకు కోడిపుంజులను కూడా సిద్ధం చేశారు. బయటి ప్రాంతాల నుంచి పందెం పుంజులను రూ.వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసి తీసుకొచ్చారు. పందేల కోసం గ్రామ శివారుల్లో రూ.లక్షల్లో పందేలు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అక్రమార్జనే ధ్యేయంగా సంక్రాంతి పండుగకు కోడిపందేలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులకు ప్రతి బరి నుంచి 10 శాతం కమీషన్ ఇచ్చేలా వాటాలు ప్లాన్ చేసినట్లు సమాచారం.
నిషేధం ఉన్నప్పటికీ..
మట్కా, పేకాట, గుట్కా, కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో ఏదో చోట నిత్యం కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలిసింది. సీజనల్గా వచ్చే ఆటలను ‘క్యాష్’ చేసుకునేందుకు అక్రమార్కులు సిండికేటుగా మారినట్లు సమాచారం. తమకు తెలియకుండా నిర్వహించదలిచే స్థావరాలపై పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నట్లు తెలిసింది.
గ్రామాల్లోనే ఎక్కువగా..
ఏటా సంక్రాంతి పండుగ సమయంలో కోడిపందేలు నిర్వహించడం కొన్ని గ్రామాల్లో ఆనవాయితీగా వస్తోంది. పోలీసుల కళ్లుగప్పి శివారు ప్రాంతాలకు వెళ్లి ‘బరి’ నిర్వహిస్తారు. సంప్రదాయం, ఉల్లాసం నుంచి పందెం, వ్యాపారంలా మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో కోడిపందేలకు తావు లేకుండా పోయింది. ఈసారి మూడు పార్టీల నాయకులు ఉండటంతో ఒకరు ఔనంటూ.. ఇంకొకరు కాదంటూ ఉండటంతో కోడిపందేలు యథేచ్ఛగా సాగే అవకాశం ఉంది.
జిల్లాలో కూటమి నాయకుల బరితెగింపు
గ్రామాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు
గ్రామ శివారుల్లో ప్రత్యేక స్థావరాలు
కట్టడి చేయాలంటున్న ప్రజానీకం
వదిలే ప్రసక్తే లేదు
కోడి పందేలకు అనుమతులు లేవు. ఎక్కడైనా నిర్వహించినా.. నిర్వహించనున్నట్లు తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. మట్కా, పేకాట, గుట్కా, గంజాయితో పాటు కోడి పందేలపై ప్రత్యేక దృష్టి సారించాం.
– ఎస్.సతీశ్కుమార్, ఎస్పీ
‘పచ్చ’ పందేరం!


