యువత మత్తుకు బానిసకారాదు
● క్రమశిక్షణతో చదువుకుని
భవితకు బాటలు వేసుకోవాలి
● అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ
హిందూపురం: యువత మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోరాదని అదనపు జిల్లా జడ్జి కంపల్లె శైలజ, ప్రభుత్వ ఆస్పత్రి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ జీవన పేర్కొన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షతన జాతీయ యువ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి శైలజ మాట్లాడుతూ.. యువతపైనే దేశ భవిత ఆధారపడి ఉందన్నారు. అందువల్ల చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి మార్గంలో పయనించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌరహక్కులను సద్వినియోగం చేసుకుంటూ చట్టాలపై అవగాహన పెంచుకుని దేశసంపదగా ఎదగాలన్నారు. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకెళితే ఏదైనా సాధించవచ్చునన్నారు. మానసిక వైద్యనిపుణురాలు డాక్టర్ జీవన మాట్లాడుతూ... క్షణకాలం ఆనందంకోసం మత్తుకు బానిసలయ్యేవారు జీవితాలను దుర్భరం చేసుకుంటురన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల అవయవాల పనితీరు మందగించి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ప్రతి ఒక్కరూ సరైన పోషకాహారం, శారీరక శ్రమ, యోగా, ధ్యానం వంటి అంశాలను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకుని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. సమావేశంలో న్యాయవాదులు సుదర్శన్, శ్రీనివాసరెడ్డి, కళావతి, సంతోషి కుమారి, మురళి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీఎన్జీజీఓ జిల్లా అధ్యక్షుడిగా
లింగా రామ్మోహన్
● జిల్లా కమిటీ ఎన్నిక ఏకగ్రీవం
పుట్టపర్తి టౌన్: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ సంఘం (ఏపీఎన్జీజీఓ) జిల్లా అధ్యక్షుడిగా లింగా రామ్మోహన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీఎన్జిజిఓ జిల్లా ఎన్నికల షెడ్యూల్ మేరకు సోమవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడంతో సభ్యులంతా కలిసి జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. దీంతో జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు వేణుగోపాల్రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి శ్రీనివాస్ ప్రకటించారు. సంఘం జిల్లా అధ్యక్షులుగా లింగా రామ్మోహన్ (ఎంపీహెచ్ఈఓ, బుక్కపట్నం పీహెచ్సీ) గౌరవాధ్యక్షులుగా ఈశ్వరప్ప (సీనియర్ అసిస్టెంట్, సెరికల్చర్), ఉపాధ్యక్షులుగా గఫూర్, రామ్మోహన్ ప్రసాద్, రవీంద్రారెడ్డి, రమేష్, రమేష్బాబు, రాజేశ్వరి, సెక్రటరీగా ఈశ్వర్నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాజు, జాయింట్ సెక్రటరీలుగా సాయి బహుతుల్య, హరీష్, పరమేశ్వర్రావ్, చంద్రమోహన్, శ్రీధర్, జయంతి, జనార్దన్, ట్రెజరర్గా జె. ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీని ఉద్యోగులు శాలువలు, పూలపూల మాలలతో సన్మానించారు. ఎన్నికల రాష్ట పరిశీలకులు ప్రసాద్యాదవ్ నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజీజీఓ నూతన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ..ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. అంతకుముందు గణేష్ కూడలి నుంచి సాయి ఆరామం వరకు ఉద్యోగులంతా ర్యాలీ నిర్వహించారు.
జాతీయ స్థాయి జూడో
పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు
ధర్మవరం రూరల్: జాతీయ స్థాయి జూడో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ తరఫున ధర్మవరం మండలం చిగిచెర్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల పీడీ ప్రతాప్రెడ్డి సోమవారం వెల్లడించారు. ఎంపికై న వారిలో కావ్యశ్రీ, సంజన, వీక్షిత్ ఉన్నారు. వీరు ఈ నెల 6 నుంచి పంజాబ్లోని లుధియానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఏపీ తరఫున పాల్గొననున్నారు. ఎంపికై న విద్యార్థులను ఆ పాఠశాల హెచ్ఎం తిమ్మారెడ్డి, పీడీ ప్రతాపరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.
యువత మత్తుకు బానిసకారాదు


