సాక్షి, పథనంతిట్ట: శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతుండగా మరో చోరీ వెలుగు చూసింది. ఈసారి ‘ఆదియ శిష్టం నెయ్యి’ (నెయ్యాభిషేకం నైవేద్యం నుంచి మిగిలిపోయిన నెయ్యి) అమ్మకంలో అక్రమాలు బయటపడ్డాయి. సాధారణంగా నెయ్యభిషేకానికి అవకాశం లేని యాత్రికులు ఈ ఆదియ శిష్టం నెయ్యిని కొనుగోలు చేస్తారు.
దీనిని వంద మిల్లీలీటర్ల పౌచ్లలో విక్రయిస్తారు. దీని ధర ప్యాకెట్కు రూ. 100. దేవస్వం విజిలెన్స్ దర్యాప్తులో సుమారు రూ. 16 లక్షల విలువైన 16 వేల నెయ్యి ప్యాకెట్లు మాయమైనట్లు తేలింది. సాధారణంగా ఆలయ ప్రత్యేక అధికారి స్టాక్ని స్వీకరించి సంబంధిత కౌంటర్లకు అమ్మకానికి అప్పగిస్తారు. అయితే అందుకున్న ప్యాకెట్లకు చెల్లించాల్సిన మొత్తం దేవస్వం ఖాతాకు జమ అవ్వలేదని విజిలెన్స్ తనిఖీలో బయటపడింది. ప్రస్తుతం మండల సీజన్లో అమ్ముడైన నెయ్యి ప్యాకెట్లకు, వచ్చిన ఆదాయానికి మధ్య వ్యత్యాసం ఉండటంతోనే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
నిజానికి నెయ్యి పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయి. దేవస్వం బోర్డు పరిధిలోని వివిధ దేవాలయాల పూజారులకు ఈ కౌంటర్లలో విధులు అప్పగిస్తారు. అయితే అమ్మకానికి జారీ చేసేవి, విక్రయం అయినవి, మిగిలిన స్టాక్ వంటి వివరాలు రిజస్టర్లో సరిగా నమోదు కాలేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గతేడాది కూడా ఇలాంటి అవతవకలే జరిగాయన వెల్లడైంది. కానీ వాటిని తరుచుగా అకౌంటింగ్ లోపాలుగా తోసిపుచ్చుతుండటం గమనార్హం.
ఈ నెయ్యి ప్యాకెట్ల పంపిణికి సంబంధించి సరైన రిజిస్టర్లు లేకపోవడంతోనే ఇలా తరుచుగా అవతవకలు జరుగుతున్నాయనే వాదనలు గట్టిగా వినిపిస్తునన్నాయి. ఓ పక్క విజిలెన్స్ దర్యాప్తు జరుపుతున్నప్పటికీ అధికారిక స్థాయిలో ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా పరిష్కరించుకునే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, దేవస్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓజీ బిజు మాట్లాడుతూ..తమ దృష్టికి ఈ విషయం రాగానే విజిలెన్స్కు సమాచారం అందించాం. దయ చేసి నిజం బయటకు రానివ్వండి లేదంటే ఎవ్వరికి రక్షణ లేకుండా పోతుందని అన్నారు.
(చదవండి: శబరిమలలో ఫుల్రష్..! దర్శనం కోసం బారులు తీరిన భక్త జనసంద్రం..)


