న్యూఢిల్లీ: ప్రకటనల సంబంధిత డేటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గోప్యత, అంగీకార నిర్దేశకాలను వర్తింపజేస్తామని సోషల్ నెట్వర్కింగ్ వేదిక వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపాయి. ఈ విషయంలో ఎన్సీఎల్ఏటా విధివిధానాలకు కట్టుబడతామని పేర్కొన్నాయి.
ఎన్సీఎల్ఏటా నిర్దేశాలను సవాలు చేస్తూ ఆ సంస్థలు పెట్టుకున్న పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలీ ధర్మాసనం విచారణ జరిపింది. ట్రిబ్యునల్ నిర్దేశాలను మార్చి 16 కల్లా అమలు చేయాలని మెటా, వాట్సాప్ నిర్ణయించినట్టు వాటి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన విజ్ఞాపనలను పరిగణనలోకి తీసుకుంది. దాంతో వాట్సాప్, మెటా పిటిషన్లను పరిష్కరించినట్టు భావించాలని ధర్మాసనం పేర్కొంది.
ప్రైవసీ పాలసీ ఉల్లంఘనకు సంబంధించి వాట్సాప్కు సీసీఏ గతంలో రూ.213.14 కోట్ల జరిమానా విధించడం తెలిసిందే. డేటా షేరింగ్ పేరిట పౌరుల భద్రతతో ఆటలాడటాన్ని అనుమతించబోమని ఫిబ్రవరి 3న మెటా, వాట్సాప్లను సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది.
చదవండి: ఏఐ గుప్పిట్లోకి కోచింగ్ మాడ్యూల్


