నెల్లూరు(టౌన్): ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ ఆక్వాటిక్ 7వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరుకు చెందిన పలువురు క్రీడాకారులు సత్తాచాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం నిర్వహించిన పోటీల్లో పినాకినీ స్విమ్మర్స్ క్రీడాకారులు 8 బంగారు, 11 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు. వారిలో మోపూరు పెంచలయ్య, బీవీ కృష్ణారెడ్డి, యు.కోటేశ్వరరావు, తురకా శ్రీనివాస్, కె.శంకరనారాయణ, ఎన్.శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్ ఉన్నారు. విజేతలను నెల్లూరు ఆక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సనత్కుమార్, పినాకినీ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.పెంచలయ్య ఆదివారం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఏషియన్ స్విమ్మింగ్ పోటీలకు అర్హత సాధించారు.


