చిల్లకూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైల్వే లైన్లు, స్టేషన్ల అబివృద్ధి, ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలిస్తోంది. తమిళనాడులోని గుమ్మిడిపూండి నుంచి గూడూరు వరకు ఉన్న రెండు లైన్లతో పాటు అదనంగా మరో రెండు లైన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలివ్వడంపై బుధవారం ఆయన హర్షం వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కృతజ్ఞతలను తెలియజేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో గతంలో తాను ప్రతిపాదించిన గుమ్మిడిపూండి – గూడూరు రైల్వేస్టేషన్ల మధ మూడు, నాలుగో లైన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగారు. దీంతో కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. రెండు లైన్లకు ఆమోదం తెలపడంతో పాటు నిధులను మంజూరు చేశామని చెప్పారు.
సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
● అగ్రి ఎక్స్పో ప్రారంభం
నెల్లూరు(వేదాయపాళెం): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కాంక్షించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో, కిసాన్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతికత, శాసీ్త్రయ సాగు పద్ధతులు క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ స్టాళ్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. వివిధ అంశాలపై రైతులు, చాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు.
ఉపాధి అవకాశంగా ఎంచుకోవాలి
ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంవైపు యువత మొగ్గు చూపి ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కాంక్షించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రదర్శనలు రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్టాళ్లను రైతులు ఆసక్తిగా తిలకించారు. మేయర్ దేవరకొండ సుజాత, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమేష్నాయక్, డీసీఓ గుర్రప్ప, ఏపీఎంఐపీ పీడీ పద్మలత, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మి, వినీత, శివజ్యోతి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో 14, 17, 19 విభాగంలో వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంత మంది విద్యార్థులు పాల్గొన్నారనే అంశమై వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అందజేయాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్), వ్యాయామ ఉపాధ్యాయుల సంతకంతో వీటిని విద్యాశాఖ కార్యాలయంలో గురువారంలోపు సమర్పించాలని పేర్కొ న్నారు. స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు గానూ వీటిని అందజేయాల్సి ఉంటుందని, వివరాలకు 94929 36165, 94946 40191 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డీసీపల్లిలో 571 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 571 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 695 బేళ్లు రాగా, వాటిలో 571ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.110.. సగటు ధర రూ.186.97గా నమోదైందని వెల్లడించారు. 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు.


