● విజేతలకు బహుమతుల ప్రదానం
నెల్లూరు(టౌన్): రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ – 2026 ఆదివారంతో ముగిసింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న నెల్లూరు క్లబ్లో మూడు రోజులపాటు జరిగాయి. పురుషుల విభాగంలో సీహెచ్ జనార్దనరెడ్డి (విశాఖ) ప్రథమ స్థానం, యు.శరత్బాబు (నెల్లూరు) ద్వితీయ స్థానం, బి.రవీంద్రారెడ్డి (గుంటూరు) తృతీయ స్థానం, జి.రమేష్ (నెల్లూరు) నాలుగో స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో ఎల్.హరిప్రియ (విశాఖ) ప్రథమ స్థానం, బి.శోభిక (తిరుపతి) ద్వితీయ స్థానం, ఎంఎస్ హారిక (విశాఖ) తృతీయ స్థానం, ఎస్కే హుస్నా సమీరా (విశాఖ) నాలుగో స్థానం సాధించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. విజేతలకు సరయూ హీరో మేనేజింగ్ డైరెక్టర్ రాజకుమార్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ కో చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులు లక్ష్య సాధనకు కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్యారమ్ సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్, విద్యుత్ శాఖ విశ్రాంత ఎస్ఈ శేషారెడ్డి, అపోలో ఆస్పత్రి సీఈఓ విశ్వేశ్వరరెడ్డి, జిల్లా క్యార మ్ సంఘం అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, కార్యదర్శి పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


