● ఆర్థిక ఇబ్బందులే కారణం
● సకాలంలో రాని 108
● ప్రైవేట్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపు
నెల్లూరు(క్రైమ్): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరులోని కొత్తహాల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రాజేంద్రనగర్ సత్యనారాయణపురంలో టి.పుష్పలత, శివయ్య దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. దంపతులు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ క్రమంలో నెల్లూరు ముత్తుకూరురోడ్డులోని ఓ ల్యాండ్ మీడియేటింగ్ పనుల నిమిత్తం వారు సుమా రు పదిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చి ఓ లాడ్జిలో ఉంటున్నారు. మంగళవారం దంపతులు రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లారు. శివయ్యకు ఫోన్ రావడంతో పక్క కు వెళ్లి తిరిగొచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. పుష్పలత కొత్తహాల్ ఎదురుగా ఉన్న నాలుగంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగి తీవ్ర రక్తసావ్రమైంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై ఉమమహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని సంతపేట పోలీసులకు సమాచారం అందించారు.
108 రాకపోవడంతో..
స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినప్పటికి సకాలంలో రాకపోవడంతో బాధితురాలిని ప్రైవేట్ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రురాలి బ్యాగ్లో లభ్యమైన ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న శివయ్య భార్యను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.


