● కర్రతో కొట్టి మహిళ హత్య
నెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు మండలం బిరదవోలు గ్రామానికి చెందిన ఎం.వెన్నెల (25)కు భర్త, పిల్లలున్నారు. పిల్లలు నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడులో ఆమె తల్లి మంగమ్మ వద్ద ఉంటున్నారు. వెన్నెలకు గతంలో మట్టెంపాడుకు చెందిన కాకుమూరు శ్రీహరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించడంతో పద్ధతి మార్చుకుంది. అప్పట్నుంచి శ్రీహరి తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని ఆమైపె ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి పిల్లలను చూసి వస్తానని భర్తకు చెప్పి మట్టెంపాడుకు వచ్చిన ఆమె తల్లి వద్దకు వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెన్నెల కోసం గాలించారు. బంధువులు తేజ, వెంకటకృష్ణ మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – పొదలకూరు రహదారిలోని ఎంఎస్ఎంఈ పార్కు సమీపంలో వెతుకుతుండగా మహిళ కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. శ్రీహరి కర్రతో వెన్నెల తలపై దాడి చేస్తున్నాడు. వారిని గమనించిన నిందితుడు బైక్పై పరారయ్యాడు. వారు ఆమె వద్దకు చేరుకుని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మంగమ్మ నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


