
టీడీపీ నేత దర్జాగా కబ్జా
వింజమూరు (ఉదయగిరి): ప్రభుత్వ భూమి కనిపిస్తే అక్రమార్కులు వాలిపోతున్నారు. వాగు, వంక, శ్మశాన భూమి, పోరంబోకా, అనాధీనమా? అనేది కూడా చూడడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని, రెవెన్యూ అధికారులను లోబర్చుకుని ఆక్రమిస్తున్నారు. సామాన్య ప్రజలు ప్రశ్నస్తే దౌర్జన్యం చేస్తూ అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటననే వింజమూరు మండలం శంఖవరం పంచాయతీ వెంకట్రాదిపాళెంలో జరుగుతోంది. మండలంలోని వెంకట్రాదిపాళెం గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి గ్రామ ఎస్సీ కాలనీకి అనుకుని తారు రోడ్డుకు పక్కనే ఉంది. ఈ భూమి ఎన్నో ఏళ్ల నుంచి ఎస్సీ కాలనీ వాసులు తమ ఉమ్మడి అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇళ్ల స్థలాల పట్టాల కోసం గతంలో ప్రభుత్వ అధికారులకు అర్జీలు కూడా ఇచ్చారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నేత విలువైన ఈ భూమిపై కన్నేశారు. తన పలుకుబడితో నిబంధనలకు వ్యతిరేకంగా రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుని పాత మ్యానువల్ అడంగళ్లలో సదరు నేతకు అనుకూలమైన పేరు రాయించుకున్నారు. దీనిని ఆసరా చేసుకుని పట్టదారు పాస్పుస్తకాలు తీసుకున్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఈ వ్యవహరంలో పెద్ద మొత్తంలో మడుపులు చేతులు మారినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంత కాలంగా గుంభనంగా ఉన్న సదరు నేత ఇటీవల ఆ భూమి కబ్జా చేసే ప్రక్రియ మొదలు పెట్టి చెట్లు తొలగించారు. దీంతో ఎస్సీ కాలనీ వాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా ఆ నేత పనులు ఆపకుండా బెదిరింపులకు దిగారు. దీంతో కాలనీ వాసులు స్థానిక వీఆర్వో, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో శుక్రవారం సదరు నేత ట్రాక్టర్ ద్వారా నాగలి తెచ్చి దున్నకం చేశశారు. జేసీబీని ఉపయోగించి నేలను చదును చేసే పనులు చేపట్టారు. దీంతో స్థానికులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దూషణకు దిగారు. దీంతో వారు తహసీల్దార్కు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. ఆయన వీఆర్వోకు తెలిపమని చెప్పి పెట్టేశారని ఎస్సీ కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేశారు.
ఐదెకరాల భూమిని గుట్టుచప్పుడు కాకుండా కాజేస్తున్న వైనం
రెవెన్యూ అధికారులను లోబర్చుకుని రికార్డుల తారుమారు
ఎస్సీ కాలనీ వాసులు అడ్డుకున్నా.. లెక్కచేయని వైనం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకుంటాం
గ్రామ 253 సర్వే నంబరుకు సంబంధించి మాన్యువల్, ఆన్లైన్ అడంగళ్లో పేర్లు ఉన్నాయి. గతంలో ఉన్న అధికారులు పట్టాదారుపాస్ పుస్తకాలు ఇచ్చారు. వీటిని లోతుగా పరిశీలించి ఫేక్, లేక ఒరినల్ అనే విషయాలు తేల్చాలి. అప్పటి వరకు ఎవరు ఈ భూమిలో ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– రవితేజ, వీఆర్వో
మాకు సెంట్ వ్యవసాయ భూమి లేదు
మా కాలనీలో చాలా మందికి సెంటు భూమి కూడా లేదు. ఈ భూమి కబ్జా చేస్తున్న వ్యక్తికి 150 ఎకరాల భూమి ఉంది. ఇదే కాకుండా గ్రామంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జా చేసి స్వాధీనం చేసుకున్నారు. మా లాంటి పేదలకు మాత్రం సెంట్ భూమి లేదు. మేము అడిగితే బెదిరింపులు తప్పుడం లేదు. అధికారం మాది అంటూ దౌర్జన్యం చేస్తున్నారు.
– వెంకటమ్మ
ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలి
మా గ్రామ సర్వే నంబరు 253లో సుమారు 5 ఎకరాలు ప్రభుత్వ భూమి మా కాలనీ అనుకొని ఉంది. అనాదిగా కాలనీ అవసరాల కోసం వాడుకుంటున్నాం. ఈ స్థలాన్ని నివేశాలకు పట్టాలు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. ఈ భూమి విలువైనది కావడంతో మా గ్రామానికి చెందిన టీడీపీ నేత నకిలీ రికార్డులు సృష్టించి కబ్జా చేస్తున్నారు. ఈ భూమి పోతే మేము ఇక్కడ ఉంటే పరిిస్థిది లేదు.
– వడ్లపల్లి చిన్నహజరత్, ఎస్సీ కాలనీ

టీడీపీ నేత దర్జాగా కబ్జా

టీడీపీ నేత దర్జాగా కబ్జా

టీడీపీ నేత దర్జాగా కబ్జా