
Photo Courtesy: BCCI
వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా అతడి గురించే చర్చ. పద్నాలుగేళ్ల వయసులోనే టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన ఈ చిచ్చర పిడుగును చూసి దిగ్గజ ఆటగాళ్లే ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొన తీరు తనకు ముచ్చటగొలిపిందని భారత లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ వైభవ్ను కొనియాడాడు.
అసలు పద్నాలుగేళ్ల వయసులో ఇలాంటి ఆటను అస్సలు ఊహించలేమని.. వైభవ్ మాత్రం బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అబ్బురపడ్డాడు. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాహుల్ ద్రవిడ్, మైకేల్ హస్సీ వంటి వారంతా రాజస్తాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు.
అయితే, టీమిండియా మాజీ కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. ఇప్పడే వైభవ్ సూర్యవంశీపై ఓ అంచనాకు రాకూడదని.. భవిష్యత్తులో అతడు కఠిన సవాళ్లు ఎదుర్కోబోతున్నాడని పేర్కొన్నాడు. వైఫల్యాలు, ఒత్తిడిని అధిగమించే తీరుపైనే అతడి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
ఈ మేరకు ఐసీసీ రివ్యూ షోలో భాగంగా రవిశాస్త్రి.. స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్తో మాట్లాడుతూ.. వైభవ్ అరంగేట్రంలో ఆడిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు. అతడికి అసాధారణ నైపుణ్యాలు ఉన్నాయని కొనియాడాడు. ‘‘లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో అతడు కొట్టిన మొదటి షాట్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టేలా చేసింది.
అయితే, అతడు ఇంకా చిన్న పిల్లాడే. ఈ వయసులో వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటాడో కూడా చూడాలి. ముఖ్యంగా తొలి బంతినే సిక్సర్గా మలిచిన వైభవ్ పట్ల బౌలర్లు ఇకపై కనికరం చూపబోరు.
అతడి వయసు 14 లేదంటే 12, 20 ఏళ్లా అని చూడరు. అతడి ఆటకు తగ్గట్లుగా సరైన వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు వస్తారు. అలాంటి వారిని వైభవ్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. అప్పుడే అతడి ఆట తీరుపై సరైన అవగాహన, అంచనాకు రాగలము’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. క్రమశిక్షణతో ముందుకు సాగితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వైభవ్కు ఈ సందర్భంగా సలహా ఇచ్చాడు.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ 1.10 కోట్లకు బిహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీని కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా అతడికి రాజస్తాన్ ఓపెనర్గా అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి రికార్డులకెక్కాడు.
ఆడిన తొలి మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొని 34 పరుగులు సాధించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. చివరగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముప్పై ఐదు బంతుల్లోనే శతక్కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో వైభవ్పై ప్రశంసలు కురిపిస్తూనే.. ఇక ముందు మరింత జాగ్రత్తగా ఆడాలంటూ రవిశాస్త్రి హెచ్చరించాడు.
In case you missed it… 🍿🔥pic.twitter.com/rOXwTuxgyX
— Rajasthan Royals (@rajasthanroyals) April 29, 2025