మరింత మెరుగుపడిన టీమిండియా.. దారుణంగా మారిన ఇంగ్లండ్‌ పరిస్థితి | WTC Points Table: India Strengthened In Second Place After 5 Wicket Victory Over England In 4th Test | Sakshi
Sakshi News home page

మరింత మెరుగుపడిన టీమిండియా.. దారుణంగా మారిన ఇంగ్లండ్‌ పరిస్థితి

Feb 26 2024 8:00 PM | Updated on Feb 26 2024 8:13 PM

WTC Points Table: India Strengthened In Second Place After 5 Wicket Victory Over England In 4th Test - Sakshi

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌లో భారత క్రికెట్‌ జట్టు పరిస్థితి మరింత మెరుగుపడింది. రాంచీ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై విక్టరీతో టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని పదిలం చేసుకుని, ఫైనల్‌ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. 

ఈ గెలుపుతో టీమిండియా విజయాల శాతం 64.58కు చేరింది. 75 శాతం విజయాలతో న్యూజిలాండ్‌ అగ్రస్థానంలో కొనసాగుతుంది. మరోవైపు భారత్‌ చేతిలో ఓటమితో ఇంగ్లండ్‌ పరిస్థితి మరింత దిగజారింది. ఆ జట్టు విజయాల శాతం 19.44 శాతానికి పడిపోయి చివరి నుంచి రెండో స్థానానికి పరిమితమైంది. అసలే ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌రేట్‌ కారణంగా ఆ జట్టు అదనంగా 19 పాయింట్లను కోల్పోయింది.

డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌, భారత్‌ల తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, శ్రీలంక జట్లు వరుసగా ఉన్నాయి. ప్రస్తుత సైకిల్‌ ముగిసే లోపు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు టెస్ట్‌ ఛాంపియప్‌షిప్‌ టైటిల్‌ కోసం తలపడతాయి. 

ఇదిలా ఉంటే, రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి గెలుపొందింది. స్వల్ప లక్ష్య ఛేదనలో (192) భారత జట్టు తొలుత తడబాటుకు లోనైనప్పటికీ ఆతర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులతో మెరిసిన దృవ్‌ జురెల్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ రాణించి (39 నాటౌట్‌) జట్టు విజయంలో ప్రధాన ప్రాత పోషించాడు. జురెల్‌కు జతగా శుభ్‌మన్‌ గిల్‌ (52 నాటౌట్‌) సైతం బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 72 పరుగులు జోడించి టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. 

స్కోర్‌ వివరాలు.. 

  • ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 353 (రూట్‌ 122 నాటౌట్‌, జడేజా 4/67)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 307 (దృవ్‌ జురెల్‌ 90, షోయబ్‌ బషీర్‌ 5/119)
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 145 (జాక్‌ క్రాలే 60, అశ్విన్‌ 5/51)
  •  భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 192/5 (రోహిత్‌ శర్మ 55, షోయబ్‌ బషీర్‌ 3/79)
  • 5 వికెట్ల తేడాతో భారత్ విజయం
  • ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌: దృవ్‌ జురెల్‌


 

Advertisement
 
Advertisement
Advertisement