WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. రవీంద్ర జడేజాకు నో ఛాన్స్‌! కారణమిదే.. అశ్విన్‌ ఉంటే..

WTC Final 2023: No Jadeja In England Great Combined Ind Aus Test XI - Sakshi

WTC Final 2023- Ind Vs Aus: ‘‘రోహిత్‌ శర్మ టాపార్డర్‌ బ్యాటర్‌. నా జట్టుకు సారథి కూడా అతడే! రోహిత్‌ కెప్టెన్సీ అంటే నాకెంతో ఇష్టం. ఇక రోహిత్‌కు జోడీగా.. నాకు శుబ్‌మన్‌ రూపంలో మంచి ఆప్షన్‌ ఉంది. అయితే, తనకు నా జట్టులో ఇప్పుడే చోటివ్వడం కాస్త తొందరపాటు చర్య అవుతుంది. 

కాబట్టి నేను నా కంబైన్డ్‌ జట్టులో మరో ఓపెనర్‌గా ఉస్మాన్‌ ఖవాజాను ఎంచుకున్నా. ఇక మూడు, నాలుగు, ఐదో స్థానాలకు మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, విరాట్‌ కోహ్లిలను ఎంపిక చేసుకుంటా.

ఒకవేళ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఇండియా లేదంటే ఉపఖండంలో జరిగితే ఆరో స్థానంలో రవీంద్ర జడేజాకు చోటిచ్చేవాడినేమో! కానీ ఇంగ్లండ్‌లో ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. కాబట్టి సీమ్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌కే నా మొదటి ప్రాధాన్యం.

నా జట్టులో అతడే ఆల్‌రౌండర్‌. ఇక స్పిన్‌ బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఎనిమిదో స్థానంలో చోటిస్తాను. లోయర్‌ ఆర్డర్‌లో అతడు చక్కగా బ్యాటింగ్‌ చేయగలడు. 

ఇక తొమ్మిదో ఆటగాడిగా ప్యాట్‌ కమిన్స్‌, పదో స్థానంలో మిచెల్‌ స్టార్క్‌, పదకొండో ఆటగాడిగా మహ్మద్‌​ షమీకి నా జట్టులో చోటు కల్పిస్తా. జస్‌ప్రీత్‌ బుమ్రా లేడు కాబట్టి నేను షమీ వైపే మొగ్గు చూపుతా’’ అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుసేన్‌ అన్నాడు.

జడ్డూకు చోటు లేదు
ఇంగ్లండ్‌ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023కి ముహూర్తం ఖారారైన విషయం తెలిసిందే. జూన్‌ 7-11 వరకు ఈ మెగా టెస్టు జరుగనుంది. ఈ నేపథ్యంలో నాసిర్‌ హుసేన్‌ భారత్‌- ఆసీస్‌ ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్‌ లెవన్‌ను ఎంపిక చేసుకున్నాడు. 

అయితే, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో అద్భుతంగా రాణించిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు మాత్రం చోటివ్వలేదు. మ్యాచ్‌ ఇంగ్లండ్‌లో కాబట్టి.. జడ్డూకు బదులు మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ వైపే మొగ్గుచూపాడు.

కాగా భారత్‌లో జరిగిన బీజీటీ-2023లో స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా కలిపి 47 వికెట్లు కూల్చగా.. ఆసీస్‌ స్టార్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌, యువ సంచలనం టాడ్‌ మర్ఫీ ఒక్కొక్కరు 36 వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023 ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో విన్నింగ్‌ షాట్‌ ఆడిన జడేజా.. చెన్నై సూపర్‌కింగ్స్‌ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఇక బీజీటీలో అశ్విన్‌తో కలిసి జడ్డూ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్న విషయం విదితమే.

డబ్ల్యూటీసీ ఫైనల్‌-2023కి నాసిర్‌ హుసేన్‌ ఎంచుకున్న కంబైన్డ్‌ ప్లేయింగ్‌ 11:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్‌, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మహ్మద్ షమీ.

చదవండి: ఆసీస్‌ అంటే పూనకాలే! వాళ్ల దృష్టి మొత్తం ఈ ఇద్దరిపైనే: ఆస్ట్రేలియా దిగ్గజం
ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top