ఇంగ్లండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌ | Womens Ashes: Australia Beat England By 86 Runs In Third ODI | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన ఆసీస్‌

Jan 17 2025 1:41 PM | Updated on Jan 17 2025 3:16 PM

Womens Ashes: Australia Beat England By 86 Runs In Third ODI

మహిళల యాషెస్‌ సిరీస్‌-2025లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇవాళ (జనవరి 17) జరిగిన మూడో వన్డేలో ఆసీస్‌ 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. 

మిడిలార్డర్‌ బ్యాటర్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (102 బంతుల్లో 102; 8 ఫోర్లు, సిక్స్‌) కెరీర్‌లో తొలి శతకంతో కదంతొక్కగా..  బెత్‌ మూనీ (64 బంతుల్లో 50; 4 ఫోర్లు), తహిళ మెక్‌గ్రాత్‌ (45 బంతుల్లో 55; 8 ఫోర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో జార్జియా వేర్హమ్‌ (12 బంతుల్లో 38 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంది. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 15, అలైసా హీలీ 15, ఎల్లిస్‌ పెర్రీ 2, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 10, అలానా కింగ్‌ 9, కిమ్‌ గార్త్‌ 1 (నాటౌట్‌) పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో లారెన్‌ బెల్‌, నాట్‌ సీవర్‌ బ్రంట్‌, చార్లీ డీన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లారెన్‌ ఫైలర్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

309 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 42.2 ఓవర్లలో 222 పరుగులకే ఆలౌటై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసీస్ లెగ్‌ స్పిన్నర్‌ అలానా కింగ్‌ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మెగాన్‌ షట్‌ మూడు, జార్జియా వేర్హమ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ట్యామీ బేమౌంట్‌ (54), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (61) అర్ద సెంచరీలతో రాణించగా.. డాన్‌ వ్యాట్‌ హాడ్జ్‌ (35), ఆమీ జోన్స్‌ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ హీథర్‌ నైట్‌ 14, చార్లీ డీన్‌ 12, సోఫీ ఎక్లెస్టోన్‌ 2, లారెన్‌ బెల్‌ 6 (నాటౌట్‌) పరుగులు చేయగా.. మయా బౌచియర్‌, అలైస్‌ క్యాప్సీ, లారెన్‌ ఫైలర్‌ డకౌట్‌ అయ్యారు.

కాగా, ప్రస్తుత యాషెస్‌ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. మల్టీ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడంతో ఆస్ట్రేలియా ఖాతాలో ఆరు పాయింట్లు (ఒక్కో వన్డేకు రెండు పాయింట్లు) ఉన్నాయి. ఆసీస్‌ మరో రెండు పాయింట్లు సాధిస్తే యాషెస్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మూడు టీ20లతో పాటు ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కూడా గెలవాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement