Sakshi News home page

WC 2023- Ind vs Pak: అతడి బ్యాటింగ్‌ అంతగొప్పగా ఏమీ ఉండదు.. షమీని ఆడించం‍డి!

Published Thu, Oct 12 2023 7:41 PM

WC 2023 Play Him Against Pakistan: Aakash Chopra Wants Shami Ahead Of Shardul - Sakshi

ICC WC 2023- Ind vs Pak: ‘‘శార్దూల్‌ ఠాకూర్‌.. మహ్మద్‌ షమీ వీరిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే చర్చ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. అయితే, చాలాసార్లు మేనేజ్‌మెంట్‌ శార్దూల్‌ వైపే మొగ్గు చూపుతుంది. ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు గనుక షమీని కాదని అతడిని తీసుకుంటారని ఇప్పటికే ఎన్నోసార్లు రుజువైంది.

అయితే, అఫ్గనిస్తాన్‌ వంటి జట్టుతో మ్యాచ్‌లో కూడా నంబర్‌ 8లో బ్యాటింగ్‌ చేసే అవకాశం ఉంటుందా? అంటే లేదనే సమాధానం చెప్పొచ్చు. లేదంటే.. కొంతమంది బిగ్‌షాట్లు ఆడే ప్లేయర్లు ఉంటారు.. వాళ్లు లేకపోతే ఓటమి ఎదురవుతుందనే సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు.

అంత గొప్ప బ్యాటరేమీ కాదు!
కానీ.. ఇలాంటి టీమ్స్‌తో ఆడినపుడు లోయర్‌ ఆర్డర్‌ వరకు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉందనుకుంటే పొరబడినట్లే! నిజానికి శార్దూల్‌ ఏమీ గొప్ప బ్యాటర్‌ కాదు. ఎనిమిదో నంబర్‌లో అతడు కేవలం రన్‌-ఏ- బాల్‌ ప్లేయర్‌ మాత్రమే.

20 బంతుల్లో 45 పరుగులు రాబట్టే రకమేమీ కాదు. అతడు అలా ఆడలేడు కూడా! ఏదేమైనా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎనిమిదో స్థానం వరకు డెప్త్‌ ఉండాలనుకుంటే వాళ్లు శార్దూల్‌ ఆడిస్తారు. కానీ నా అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శార్దూల్‌ కంటే షమీ అవసరమే ఎక్కువగా ఉంటుంది.

తదుపరి మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలి’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడిన విషయం తెలిసిందే.

చెపాక్‌లో అశ్విన్‌.. ఢిల్లీలో శార్దూల్‌
చెపాక్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ‘లోకల్‌ స్టార్‌’ రవిచంద్రన్‌ అశ్విన్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, ఢిల్లీలో అఫ్గనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌లో అశ్విన్‌ స్థానంలో పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకుంది.

అరుణ్‌జైట్లీ స్టేడియంలో అదనపు సీమర్‌ అవసరమన్న విశ్లేషణల నడుమ ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగ్‌ చేయగల సత్తా ఉన్న శార్దూల్‌ వైపు మొగ్గు చూపింది. అయితే, అఫ్గనిస్తాన్‌పై మంచి రికార్డు ఉన్న షమీని కాదని శార్దూల్‌ను తీసుకోవడం సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలకు నచ్చలేదు.

పాక్‌తో మ్యాచ్‌లో షమీని ఆడిస్తేనే బెటర్‌
ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా పైవిధంగా స్పందించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మహ్మద్‌ షమీని ఆడిస్తేనే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.

కాగా ఆసీస్‌పై 6 వికెట్లు, అఫ్గన్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొంది ఫుల్‌జోష్‌లో ఉన్న టీమిండియా అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లోని దాదాపు లక్ష సీట్ల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక పాకిస్తాన్‌ సైతం ఆడిన రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించి జోరు మీదున్న విషయం తెలిసిందే.
సాక్షి టీవీ వాట్సాప్‌ ఛానెల్‌ క్లిక్‌ చేసి ఫాలో అవ్వండి

చదవండి: WC 2023- Ind Vs Pak: పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌! కానీ..

Advertisement

What’s your opinion

Advertisement