WC 2023: వరల్డ్‌కప్‌ జట్టులో సంజూకు ఛాన్స్‌! వాళ్లిద్దరికీ షాక్‌.. | ODI WC 2023: Australia Great Matthew Hayden Adds Sanju Samson To His India Squad Snubs Chahal And Kuldeep - Sakshi
Sakshi News home page

WC 2023: వరల్డ్‌కప్‌ జట్టులో సంజూకు ఛాన్స్‌! వాళ్లిద్దరికీ షాక్‌..

Aug 29 2023 11:55 AM | Updated on Aug 29 2023 12:36 PM

WC 2023: Hayden Adds Sanju To His India Squad Snubs Chahal Kuldeep - Sakshi

వరల్డ్‌కప్‌ జట్టులో సంజూకు ఛాన్స్‌! వాళ్లిద్దరికీ షాకిచ్చిన ఆసీస్‌ లెజెండ్‌

ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్‌ అభిప్రాయపడ్డాడు. కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ప్రధాన జట్టులో చోటిస్తే బాగుంటుందన్న ఈ మాజీ ఓపెనర్‌.. ఇషాన్‌ కిషన్‌ను కూడా ఆడించాలని సూచించాడు.

ప్రపంచకప్‌ పోటీలో పది జట్లు
కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ ఈవెంట్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో పాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, నెదర్లాండ్స్‌ ట్రోఫీ కోసం పోటీలో నిలిచాయి.

అనుకున్న ఫలితం రావాలంటే
ఇక సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఆడటం రోహిత్‌ సేనకు సానుకూలాంశం. అయితే, అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉండటం సహజం. ఈ నేపథ్యంలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి సరైన సమయంలో రాణిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదు. పుష్కరకాలం తర్వాత మరోసారి స్వదేశంలో ప్రపంచ విజేతగా నిలవగలదు.

ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే జట్టు సెలక్టర్లకు సవాలుగా మారింది. ఇక ఆసియా కప్‌ ఈసారి.. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న తరుణంలో ఈ ఈవెంట్‌లో ఆడే జట్టే ప్రపంచకప్‌ ప్రొవిజినల్‌ టీమ్‌ అని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే చెప్పాడు.

సంజూకు ఛాన్స్‌.. వాళ్లిద్దరికీ షాక్‌
ఈ క్రమంలో ఆసీస్‌ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో భారత జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లో మణికట్టు స్పిన్నర్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈవెంట్‌కు తాను ఎంచుకున్న 15 మంది జట్టులో రవీంద్ర జడేజాతో పాటు అక్షర్‌ పటేల్‌కు స్పిన్నర్లుగా స్థానం కల్పించాడు.

మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్‌, ఆసియా కప్‌ జట్టులో చోటు సంపాదించిన కుల్దీప్‌ యాదవ్‌లకు షాకిచ్చాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న భారత టీ20 స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను హెడెన్‌ తన జట్టుకు ఎంపిక చేయడం విశేషం. అదే సమయంలో సీనియర్లకే పెద్దపీట వేసిన ఆసీస్‌ లెజెండ్‌ యువ సంచలనం తిలక్‌ వర్మను విస్మరించాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. 

ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2023కి మాథ్యూ హెడెన్‌ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌.

చదవండి: అలా అయితే.. 2011 వరల్డ్‌కప్‌ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: కోహ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement