హైదరాబాదీ, తెలుగు తేజం తిలక్ వర్మ భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. అక్షర్ పటేల్ స్ధానంలో ఆ బాధ్యతలను తిలక్కు బీసీసీఐ అప్పగించింది. ఇకపై టీ20ల్లో శ్రేయస్ అయ్యర్కు డిప్యూటీగా అతడు వ్యవహరించున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్, ఏషియన్ గేమ్స్కు జట్టు ఎంపిక సందర్బంగా బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని భారత మాజీ సారథి క్రిష్ణమాచారి శ్రీకాంత్ తప్పుబట్టాడు. అదేవిధంగా ఐపీఎల్-2026లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎందుకు జట్టులో తీసుకోలేదని అతడు సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.
"తిలక్ వర్మకు కెప్టెన్గా అసలు అనుభవమే లేదు. అదేవిధంగా అతడు ఫామ్లో కూడా లేడు. అతడికి భారీ షాట్లు ఆడే సత్తా సైతం లేదు. పాటిదార్ లాగా బౌలర్లను టార్గెట్ చేయలేడు. గత రెండు మూడు ఐపీఎల్ సీజన్ల నుంచి తిలక్ వర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లోనూ నిరాశపరిచాడు.
అయినప్పటికి వైస్ కెప్టెన్గా ఎంపిక చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మరోవైపు భారత టీ20 జట్టులో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కే అర్హత లేదు. అతడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున బౌలింగ్ కూడా చేయలేదు. కేవలం మిడిలార్డర్ బ్యాటర్గా ఆడాడు.
టీమిండియాలో కూడా అతడు రెగ్యులర్గా బౌలింగ్ చేయడం లేదు. అలాంటప్పుడు అతడిని ఒక ఆల్రౌండర్గా ఎలా జట్టులోకి తీసుకున్నారో సెలక్టర్లకే తెలియాలి. అతడి స్ధానంలో పాటిదార్ను ఎంపిక చేయాల్సిందని" శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.
చదవండి: IND vs ENG: అతడి కంటే భువీ ఎంతో బెటర్.. సెలక్టర్లు తప్పు చేశారు!?


